జీహెచ్ఎంసీలో వేతనాలకు నోచుకోని చిరుద్యోగులు : హైదరాబాద్
- July 31, 2016
ల్దియా నిర్లక్ష్యం సిబ్బంది పాలిట శాపంగా మారింది. సుమారు 2వేల మంది పొరుగుసేవల సిబ్బంది జీతాల్లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇంటి అద్దె చెల్లించుకోలేక రోడ్డున పడే దుస్థితి నెలకొందని, బోనాల పండుగను జరుపుకోలేకపోతున్నామని తోటమాలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పాతగుత్తేదారులకే మళ్లీ ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు దక్కాలనే ఉద్దేశంతో కొందరు ఉన్నతాధికారులు పారిశుద్ధ్య విభాగం సూపర్వైజర్లకు రెండు నెలల నుంచి జీతాలు దక్కకుండా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. చివరకు రెండు రోజుల్లో జీతాలు చెల్లించాలని కమిషనర్ ఐదు నెలల క్రితం ఆదేశాలిచ్చినా ఏ మాత్రం ఫలితం లేదు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ నాలుగో తరగతి పొరుగు సేవల సిబ్బందిని తీవ్రంగా వేధిస్తోంది. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు చొరవ తీసుకోకపోవడంతో ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. సుమారు రెండు నెలల నుంచి జీతాలు అందుకోని సిబ్బంది దాదాపు 15వందల మంది ఉన్నారని, కమిషనర్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. పార్కుల్లో పనిచేసే 181 మంది తోటమాలీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారి జీతం కేవలం రూ.7,100. వారికి ఎనిమిది నెలల నుంచి జీతాల్లేవు. కుటుంబాన్ని నెట్టుకురాలేక రోడ్డున పడే దుస్థితి నెలకొందని వారు ఆవేదన చెందుతున్నారు. మరో 80 మంది గ్రూప్డ్రైవర్లకు సైతం తొమ్మిది నెలలుగా జీతాలు అందట్లేదు. పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తోన్న 948 సూపర్వైజర్లు, ఆయా విభాగాల్లోని మరో 900మంది కంప్యూటర్ ఆపరేటర్లకు రెండు నెలలుగా జీతాల్లేవని బాధితులు చెబుతున్నారు. 'ఇదేంటని అడిగితే.. త్వరలోనే టెండర్ల ప్రక్రియను ప్రారంభించి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు సర్దిచెబుతున్నారు. ఇలాగే కాలయాపన చేస్తే సిబ్బంది ఆందోళన చేస్తారని, తద్వారా పాత గుత్తేదారులకే మళ్లీ కాంట్రాక్టు దక్కేలా చేయొచ్చనేది వారి వ్యూహం. ఏటా పొరుగు సేవల సిబ్బంది నిర్వహణకు తప్పనిసరిగా టెండర్లను పిలవాలి. పాత వాళ్లకు కట్టబెట్టే సంస్కృతి వల్ల పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతుంది.''అని సూపర్వైజర్లు ఆరోపిస్తున్నారు. అలాగే ఆయా సర్కిళ్ల పరిధిలో కొందరు ఆఫీసు నిర్వహణ సిబ్బంది, సెక్యురిటీ గార్డులు, ఇతర సిబ్బంది సైతం ఇదే సమస్య ఉందని బాధితులు చెబుతున్నారు.
పనిచేయని కమిషనర్ ఆదేశాలు.. సిబ్బంది కొనసాగింపులో ఎలాంటి ఇబ్బందులున్నా, పని చేసిన కాలానికి సక్రమంగా జీతాలు అందేలా చూసుకోవడం ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా జీహెచ్ఎంసీ బాధ్యత వహించాలి. ఆ మేరకు తోటమాలీలు, డ్రైవర్లకు జీతాలు అందట్లేదని మార్చిలో ఉద్యోగ సంఘాలు కమిషనర్ కలిసి వినతి పత్రం ఇచ్చాయి. స్పందించిన కమిషనర్ జనార్దన్రెడ్డి రెండు రోజుల్లో జీతాలు వచ్చేలా చేస్తానని రాత పూర్వకంగా వాళ్లకు హామీ ఇచ్చారు. కానీ ఆయన ఆదేశాలు ఇచ్చి ఐదు నెలలు గడుస్తున్నా ఇంత వరకు సిబ్బందికి జీతాలు అందలేదు. ఇంటి అద్దె, పిల్లల చదువు వంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని, వచ్చే రూ.7వేల జీతాన్ని ఎనిమిది నెలల నుంచి ఇవ్వకపోతే బతుకు ఎలా కొనసాగించాలని ఓ కార్మికురాలు 'ఈనాడు'తో వాపోయారు. కమిషనర్ ఆదేశాలను జోన్స్థాయి అధికారులు పట్టించుకోవట్లేదని, వారిపై చర్యలు లేకపోవడంతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









