రేపే చంద్రగ్రహణం..ఆలయాలు మూసివేత
- March 02, 2026
రేపు ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. రేపు మధ్యాహ్నం 3.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై, సాయంత్రం 6.48 గంటలకు ముగుస్తుంది. ఇందులో ముఖ్యంగా సాయంత్రం 4.34 నుంచి 5.33 గంటల వరకు ‘సంపూర్ణ గ్రహణ కాలం’గా ఉంటుంది. అయితే, భారత్లో ఇది సాయంత్రం 6.20 గంటల నుండి సుమారు 27 నిమిషాల పాటు కనిపిస్తుంది. అండమాన్ దీవులు మరియు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహాయించి, దేశవ్యాప్తంగా దాదాపు అన్ని చోట్లా ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు. మళ్ళీ ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం భారత్లో 2028 డిసెంబరు 31న మాత్రమే కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
గ్రహణ ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు రేపు మూతపడనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో గ్రహణ సమయానికి ముందే అంటే ఉదయం 9 గంటలకే దర్శనాలను నిలిపివేసి, తిరిగి రాత్రి 7.30 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. అటు తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఉదయం 7 గంటలకే మూసివేసి, తిరిగి బుధవారం నాడు తెరుస్తామని ఆలయ అధికారులు ప్రకటించారు. గ్రహణం కారణంగా రేపు జరగాల్సిన హోలికోత్సవాన్ని (కామదహనం) ఒకరోజు ముందుగానే అంటే ఈరోజే నిర్వహించాలని యాదగిరిగుట్ట ఆలయ యాజమాన్యం నిర్ణయించింది.
సాధారణంగా గ్రహణ కాలంలో అన్ని ఆలయాలు మూసివేసినప్పటికీ, చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ రాహు-కేతు క్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయం మాత్రం రేపు తెరిచే ఉంటుంది. ఇక్కడ గ్రహణ సమయంలో స్వామివారికి మరియు అమ్మవారికి ప్రత్యేకమైన ‘గ్రహణ కాల అభిషేకాలు’ నిర్వహిస్తారు. గ్రహణ ప్రభావం ఈ క్షేత్రంపై ఉండదని, పైగా గ్రహణ సమయంలో పూజలు చేయడం అత్యంత ఫలప్రదమని భక్తుల నమ్మకం. మిగిలిన ఆలయాల్లో మాత్రం గ్రహణం వీడిన తర్వాత సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









