ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!

- March 19, 2026 , by Maagulf
ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!

దోహా: ఖతార్ ఆరోగ్య సంరక్షణ రంగం అత్యున్నత స్థాయిలో పనిచేస్తోందని, నిరంతరాయ సేవలు అందించడానికి మరియు ఏ అత్యవసర పరిస్థితికైనా వేగంగా స్పందించడానికి అన్ని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని ప్రజారోగ్య శాఖ మంత్రి హెచ్.ఇ. మన్సూర్ బిన్ ఇబ్రహీం బిన్ సాద్ అల్ మహమూద్ ఓ ఇంటర్వ్యూలో ధృవీకరించారు.

ఖతార్‌లోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నిరంతర పర్యవేక్షణ మరియు ఒక సమగ్ర కార్యాచరణ ప్రకారం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.దేశ అవసరాలను తొమ్మిది నెలల వరకు తీర్చగల బలమైన వ్యూహాత్మక మెడిసిన్ నిల్వలు, నిరంతర సరఫరా నెట్ వర్క్ తో బలంగా ఉందని స్పష్టం చేశారు.   

వైద్య సరఫరా రంగంలో గల్ఫ్ సహకార మండలి సభ్య దేశాల మధ్య బలమైన సమన్వయం ఉందని, ఫార్మాస్యూటికల్స్ లేదా అవసరమైన వైద్య సామగ్రిని దిగుమతి చేసుకోవడంలో ఎటువంటి సవాళ్లు ఎదురుకాలేదని ఆయన పేర్కొన్నారు. ఏవైనా అంతరాయాలు ఏర్పడితే, సేవలు నిరంతరాయంగా కొనసాగేలా చూసేందుకు వాటిని వెంటనే పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. ఇందు కోసం ఒక ప్రత్యేక ఆపరేషన్స్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది నిరంతరం మెడికల్ నెట్ వర్క్ ను పర్యవేక్షిస్తోందని మంత్రి వెల్లడించారు.

ఈ సందర్భంగా అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న వైద్య మరియు పరిపాలనా సిబ్బంది నిరంతర కృషిని మంత్రి ప్రశంసించారు. డయాలసిస్, చిన్నపిల్లల టీకాలు, మరియు ఆరోగ్య కేంద్రాలలో రోగులను చేర్చుకోవడం వంటి సాధారణ మరియు కీలకమైన సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయని అల్ మహమూద్ తెలిపారు.

రక్త సరఫరా విషయానికి వస్తే, నిల్వలు సరిపోవడమే కాకుండా ప్రస్తుతం సాధారణ స్థాయిలను మించి ఉన్నాయని పేర్కొన్నారు.ప్రైవేట్ ఆసుపత్రుల మద్దతుతో ఖతార్ ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిందని ఆయన పేర్కొన్నారు.  

దేశ ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో సుమారు 60వేల మంది అత్యంత అర్హత కలిగిన వైద్య మరియు నర్సింగ్ నిపుణులు ఉన్నారని, వీరు వైద్య వ్యవస్థ సామర్థ్యానికి దోహదపడుతున్నారని పేర్కొన్నారు.  

ఖతార్ లో ప్రస్తుత అసాధారణ పరిస్థితులు ఉన్నాయని, ఇప్పటివరకు నమోదైన కేసులన్నీ స్వల్పమేనని, వారికి వెంటనే చికిత్స అందించి పంపినట్లు అల్ మహమూద్ అన్నారు. ఇక సమాచారం కోసం అధికారిక వనరులపై మాత్రమే ఆధారపడాలని, ధృవీకరించని వార్తలను వైరల్ చేయవద్దని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com