ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్

- April 06, 2026 , by Maagulf
ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్

దోహా: ఖతార్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీకి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ ఫోన్ చేశారు. సోమవారం జరిగిన ఈ కీలక టెలిఫోన్ సంభాషణలో ప్రాంతంలో కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతలు, వాటి ప్రభావం ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రత పై ఎలా పడుతోందనే అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఇరు నేతలు ప్రాంతీయ వివాదాలను శాంతియుత మార్గంలో పరిష్కరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.ముఖ్యంగా నౌకాయాన స్వేచ్ఛ (Freedom of Navigation) నిరంతరంగా కొనసాగడం ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరాలకు అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు.

ఖతార్ ప్రధాని అల్ థానీ మాట్లాడుతూ, ఖతార్‌తో పాటు ప్రాంతంలోని ఇతర దేశాల పై జరుగుతున్న అన్యాయమైన ఇరాన్ దాడులను వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా నీరు, ఆహారం, ఇంధన వసతులకు సంబంధించిన కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం అత్యంత బాధ్యతారాహిత్య చర్య అని హెచ్చరించారు.

అంతేకాకుండా, సంక్షోభాన్ని అదుపులోకి తెచ్చేందుకు సమన్వయాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి ప్రయత్నాలను ముమ్మరం చేయడం, చర్చల కి తిరిగి రావడం, వివేకం మరియు సంయమనం పాటించడం అవసరమని ఆయన పేర్కొన్నారు.ఈ చర్యల ద్వారా ప్రపంచ ఇంధన భద్రత, నౌకాయాన స్వేచ్ఛ, పర్యావరణ రక్షణతో పాటు ప్రాంతీయ స్థిరత్వం కాపాడవచ్చని అన్నారు.

ఇటీవలి పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశం గల్ఫ్ దేశాలతో నిరంతర దౌత్య సంప్రదింపులు కొనసాగిస్తూ, ఇంధన సరఫరాలు మరియు సముద్ర మార్గాల భద్రత పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com