విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్

- April 06, 2026 , by Maagulf
విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రపంచ టెక్ దిగ్గజం ‘గూగుల్’ తన భారీ డేటా సెంటర్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన తేదీ ఖరారైంది. ఏప్రిల్ 28వ తేదీన విశాఖ వేదికగా ఈ ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించనున్నారు.

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. వీరితో పాటు గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ కూడా హాజరై ప్రాజెక్టు పనులను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఏపీని గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంలో భాగంగా ఈ ప్రాజెక్టు అత్యంత కీలకం కానుంది.  మొత్తం మూడు చోట్ల 601.4 ఎకరాలను కేటాయించింది. తర్లువాడలో 266.6 ఎకరాలు, రాంబిల్లిలో 174.8 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు కలిపి మొత్తం 601.4 ఎకరాలను గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం కేటాయించింది. 

పెట్టుబడి, సుమారు 15 బిలియన్ డాలర్లు (దాదాపు ₹1.25 లక్షల కోట్లు).1000 మెగావాట్ల డేటా ప్రాసెసింగ్ సామర్థ్యం.గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ మరియు అదానీ ఇన్ఫ్రా సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి.2028 జూలై నాటికి ఈ డేటా సెంటర్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.తర్లువాడలో సర్వేనంబర్ ఒకటిలోని భూములను గూగుల్ సంస్థకు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ భూముల రైతులకు ఇప్పటికే నష్ట పరిహారం కూడా అందజేసింది.

ఆ భూములలో జీడి మామిడి, మామిడి వంటి తోటలతో పాటుగా ఇతర చెట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటిని తొలగించే జంగల్ క్లియరెన్స్ పనులను ఏపీఐఐసీకి అప్పగించింది. ఏపీఐఐసీ సంస్థ ఓ కాంట్రాక్టర్‌కు ల్యాండ్ స్కేపింగ్ పనులు అప్పగించగా.. ఆ సంస్థ జంగల్ క్లియరెన్స్ పనులను మెజారిటీ శాతం పూర్తి చేసింది. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఆలోగా చదును చేసే పనులను పూర్తి చేయాలనే ఉద్దేశంతో పనులు చేపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com