ఖతార్ మధ్యవర్తిత్వానికి మద్దతు ఇస్తుంది.. అన్నింటికి ఖతార్ సిద్ధం..!!

- April 08, 2026 , by Maagulf
ఖతార్ మధ్యవర్తిత్వానికి మద్దతు ఇస్తుంది.. అన్నింటికి ఖతార్ సిద్ధం..!!

దోహా: ఇరాన్, అమెరికా మధ్యవర్తిత్వం విషయంలో ఖతార్ వైఖరి మారలేదని ప్రధానమంత్రి సలహాదారు మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ మజీద్ బిన్ మహమ్మద్ అల్ అన్సారీ పునరుద్ఘాటించారు.  మిడిలీస్టులో పెరుగుతున్న ముప్పు మరియు ఇరాన్ దాడుల నేపథ్యంలో ఆత్మరక్షణపై దృష్టి సారించడం వల్ల ఖతార్ ప్రత్యక్షంగా పాలుపంచుకోనప్పటికీ, మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు  ఖతార్ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఖతార్  అన్ని రకాల ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని, గతంలో ఇంతకంటే పెద్ద సవాళ్లను కూడా అధిగమించిందని, తమ మార్కెట్లు మరియు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని సాధించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని ఆయన తెలిపారు.

ఈ ప్రాంతంలో ఇరాన్ జాతీయ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడాన్ని ఖతార్ రాజ్యం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. పౌర మౌలిక సదుపాయాలు మరియు ఇంధన సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవడం సంక్షోభాన్ని మరింత క్లిష్టతరం చేసి, ఈ ప్రాంతానికి కొత్త సవాళ్లను తెచ్చిపెట్టే ప్రమాదకరమైన ఉద్రిక్తతను సూచిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి రోజుల్లో డ్రోన్‌లతో సహా ఇరాన్ దాడులను ఖతార్ సాయుధ దళాలు ఎదుర్కొన్నాయని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి  పూర్తి  సిద్ధంగా ఉన్నామని అల్ అన్సారీ తెలిపారు.
హోర్ముజ్ జలసంధి గురించి ఆయన మాట్లాడుతూ.. దానిని మూసివేయడం ఒక ప్రమాదకరమైన చర్య అని అన్నారు. అంతర్జాతీయ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమే కాకుండా ప్రపంచ భద్రతకు, ఆయిల్-గ్యాస్ సరఫరాలకు, ఫుడ్ బిజినెస్ లకు ప్రత్యక్ష ముప్పు అని అన్నారు.

ఈ జలసంధి ఒక ఉమ్మడి సహజ జలమార్గమని, దానిని రాజకీయ ఒత్తిడి సాధనంగా ఉపయోగించలేమని తెలిపారు. దానిని తక్షణమే తిరిగి తెరవాలని, ఎలాంటి బెదిరింపులు లేకుండా నౌకాయాన స్వేచ్ఛను కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ఖతార్ గ్యాస్ క్యారియర్‌ల గురించి అల్ అన్సారీ మాట్లాడుతూ, ఈ జలసంధి మూసివేత కారణంగా ఈ ప్రాంతంలోని అన్ని దేశాలు మరియు అనేక అంతర్జాతీయ భాగస్వాములు నష్టపోతున్నారని పేర్కొన్నారు.  ఈ విధంగా జలసంధిని మూసివేయడం అనేది... ఇది అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా, ప్రపంచ సరఫరా గొలుసులకు అంతరాయం కలిగిస్తుందని, మరియు ప్రపంచ ఇంధన, ఆహార పరిశ్రమలకు ముప్పు అని వివరించారు.

హోర్ముజ్ జలసంధి, నిర్దిష్ట దేశాల అధికార పరిధిలో ఉన్న పనామా కాలువ లేదా సూయజ్ కాలువ లాంటిది కాదని, ఇది అన్ని ఓడలు, నౌకలు ప్రయాణించే సహజసిద్ధమైన బహిరంగ జలసంధి అని ఆయన అన్నారు. ఓడలు ఎల్లప్పుడూ దీని గుండా సాధారణంగానే ప్రయాణిస్తున్నందున, గతంలో ఇలాంటి చర్యల అవసరం ఎప్పుడూ రాలేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిణామాలపై గల్ఫ్ మరియు అరబ్ దేశాలు, మిత్ర దేశాలతో కలిసి అంతర్జాతీయ భాగస్వాములతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నాయని మహమ్మద్ అల్ అన్సారీ సూచించారు.

భవిష్యత్తులో కుదిరే ఏ ఒప్పందమైనా సమగ్ర ప్రాంతీయ ఏకాభిప్రాయంపై ఆధారపడి ఉండాలని, అంతర్జాతీయ హామీలను కలిగి ఉండాలని, దాని రూపకల్పనలో సంఘర్షణకు సంబంధించిన, ప్రభావితమైన అన్ని పక్షాల భాగస్వామ్యంతో అంతర్జాతీయ చట్టానికి గౌరవం ఇచ్చే విధంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ సంక్షోభానికి ఏకైక పరిష్కారం రాజకీయ, చర్చల ప్రక్రియ పునరుద్ఘాటించారు. ఈ ప్రాంత భద్రత మరియు స్థిరత్వాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.  

ఈ యుద్ధంతో అంతర్జాతీయ సమాజం నిమగ్నమై ఉన్న పరిస్థితిని అవకాశంగా తీసుకుని, ఇజ్రాయెల్ చేస్తున్న ఆక్రమణ  ప్రయత్నాలపై హెచ్చరించారు. ఇజ్రాయెల్ ప్రయత్నాలు సిగ్గుచేటని, అంతర్జాతీయ ఒప్పందాలను మరియు అంతర్జాతీయ చట్టాలను తప్పించుకోవడమే లక్ష్యమని ఆయన అన్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com