కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..

- April 09, 2026 , by Maagulf
కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..

అస్సాం, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. పోలింగ్ ప్రారంభ సమయం నుంచి ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చాలామంది రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులుసైతం ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమతమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కేరళలలో ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఇతర మంత్రులు, నటులు మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, నటుడు, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ వంటి వారు ఓటు వేశారు. తన భార్య సుల్ఫత్ కుట్టితో కొచ్చిలోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన సినీహీరో మమ్ముటి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మూడు రాష్ట్రాల్లో ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సాగుతోంది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఉదయం 9గంటల వరకు అస్సాంలో 18.87శాతం, కేరళ రాష్ట్రంలో 16.23శాతం, పుదుచ్చేరిలో 17.41శాతం పోలింగ్ నమోదైంది.

పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. 294 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 10,14,070 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 5,39,125 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరంతా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

అస్సాం రాష్ట్రంలో 126 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 722 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. 2.25 కోట్ల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,25,22,593 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఓటర్లు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

కేరళ రాష్ట్రంలో 140 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 883 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో 2.6కోట్ల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,38,27,319 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com