లూలు మాల్‌కు భూకేటాయింపు రద్దు

- April 09, 2026 , by Maagulf
లూలు మాల్‌కు భూకేటాయింపు రద్దు

అమరావతి: విజయవాడ నగరం నడిబొడ్డున లూలు మాల్ నిర్మాణానికి కేటాయించిన భూమి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మలుపు తీసుకుంది. లూలు గ్రూప్‌నకు ఇచ్చిన భూకేటాయింపులను రద్దు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం బుధవారం ఏపీ హైకోర్టుకు అధికారికంగా వెల్లడించింది.

విజయవాడ పాత బస్టాండ్ సమీపంలోని సుమారు 4.15 ఎకరాల ఆర్టీసీ (APSRTC) స్థలాన్ని లూలు మాల్‌కు కేటాయించడాన్ని సవాలు చేస్తూ మాజీ మంత్రి, రైతు నేత వడ్డే శోభనాద్రీశ్వరరావుతో పాటు మరికొందరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ సంస్థకు కారుచౌకగా కట్టబెడుతున్నారని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనానికి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. లూలు మాల్‌కు ఇచ్చిన భూకేటాయింపు ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందని, ఇందుకు సంబంధించిన అధికారిక రద్దు ఉత్తర్వులను (Cancellation Orders) త్వరలోనే జారీ చేస్తామని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ వివరణను నమోదు చేసుకున్న హైకోర్టు, రద్దు ఉత్తర్వుల ప్రతిని సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. గతంలో ఈ భూమి కేటాయింపుపై ప్రతిపక్షాలు, వామపక్షాలు మరియు పౌర సమాజం నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో విజయవాడ ఆర్టీసీ స్థలం వివాదానికి ప్రస్తుతానికి తెరపడినట్లయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com