ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు

- April 10, 2026 , by Maagulf
ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు

అబుదాబి: యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ నేడు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ను అబుదాబిలో ఆత్మీయంగా ఆహ్వానించి కీలక చర్చలు నిర్వహించారు. ప్రాంతీయ భద్రత, మధ్యప్రాచ్య పరిణామాలు, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

సమావేశంలో మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, వాటి ప్రభావం ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రత పై ఎలా పడుతోందన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ముఖ్యంగా సముద్ర మార్గ భద్రత, ఇంధన సరఫరాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై ఏర్పడే ప్రభావాలపై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

యూఏఈతో పాటు ప్రాంతంలోని ఇతర దేశాల్లో పౌరులు, పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఇరాన్ దాడులను కూడా చర్చలో ప్రస్తావించారు. ఇవి సార్వభౌమత్వానికి, అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు విరుద్ధమని, ప్రాంతీయ శాంతి భద్రతలను దెబ్బతీస్తున్నాయని ఇరుపక్షాలు అభిప్రాయపడ్డాయి.

ఈ సందర్భంగా ప్రధాని స్టార్మర్ దాడులను యునైటెడ్ కింగ్‌డమ్ ఖండిస్తోందని పునరుద్ఘాటించారు. యూఏఈ తన భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు తీసుకుంటున్న చర్యలకు బ్రిటన్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు.

అలాగే యూఏఈ–బ్రిటన్ సంబంధాల పురోగతిని సమీక్షించిన ఇరువురు నేతలు, పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఆర్థిక, వ్యూహాత్మక, భద్రతా రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే అవకాశాలను పరిశీలించారు.

ఈ సమావేశానికి అబుదాబి ఉప పాలకుడు మరియు జాతీయ భద్రతా సలహాదారు షేక్ తనూన్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ సహా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com