మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ

- April 13, 2026 , by Maagulf
మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుతో భారతదేశం సరికొత్త చరిత్రను లిఖించబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన ‘నారీ శక్తి వందన్ సమ్మేళన్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ బిల్లు రాబోయే కాలంలో భారత ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని వెల్లడించారు.

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు త్వరలోనే చట్టం రూపం దాల్చనుందని ప్రధాని తెలిపారు. 21వ శతాబ్దంలో భారతదేశం తీసుకోబోయే అత్యంత సాహసోపేతమైన, అతిపెద్ద నిర్ణయాల్లో ఇది ఒకటి అని ఆయన అభివర్ణించారు. మహిళల నాయకత్వంలో జరిగే అభివృద్ధి దేశాన్ని వేగంగా ముందుకు నడిపిస్తుందని, ఆ దిశగా ఈ చట్టం ఒక మైలురాయిగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు అత్యంత అవసరమని, దీనిని విజయవంతం చేయడానికి ప్రతి రాజకీయ పార్టీ సహకరించాలని ప్రధాని పిలుపునిచ్చారు. 2029 నాటికి ఈ రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలు కావాలని ఆయన ఆకాంక్షించారు. మహిళలు నిర్ణయాధికారంలో భాగస్వాములైనప్పుడు అభివృద్ధి మరింత పారదర్శకంగా, వేగంగా జరుగుతుందని ఆయన నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో దేశ రాజధాని ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో మహిళా ప్రతినిధులు హాజరై ప్రధాని ప్రసంగాన్ని ఉత్సాహంగా ఆలకించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com