ఏప్రిల్ 15 నుంచి కొత్త జరిమానా నిబంధనలు అమలు

- April 14, 2026 , by Maagulf
ఏప్రిల్ 15 నుంచి కొత్త జరిమానా నిబంధనలు అమలు

న్యూ ఢిల్లీ: జాతీయ రహదారులపై పరిమితికి మించి బరువుతో ప్రయాణించే వాహనాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. రహదారుల భద్రతను పెంచడం మరియు మౌలిక సదుపాయాలను కాపాడటమే లక్ష్యంగా కొత్త రుసుము విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ‘జాతీయ రహదారుల రుసుము (రేట్ల నిర్ధారణ, సేకరణ) నాలుగో సవరణ నిబంధనలు – 2026’ను నోటిఫై చేసింది. ఈ నిబంధనలు ఏప్రిల్ 15, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.

ఫీజుల విధానం ఇలా
కొత్త నిబంధనల ప్రకారం ఓవర్‌లోడ్ వాహనాలకు అదనపు బరువు శాతం ఆధారంగా జరిమానాలు విధిస్తారు.

  • అనుమతించిన బరువుకు 10% వరకు అదనంగా ఉంటే ఫీజు లేదు.
  • 10% నుంచి 40% వరకు అదనపు బరువు ఉంటే బేస్ టోల్ రేటుకు రెట్టింపు ఫీజు వసూలు చేస్తారు.
  • 40% కంటే ఎక్కువ ఓవర్‌లోడ్ ఉంటే బేస్ టోల్ రేటుకు నాలుగు రెట్లు జరిమానా విధిస్తారు.

టెక్నాలజీతో అమలు

టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన WIM (వే-ఇన్-మోషన్) యంత్రాల ద్వారా వాహనాల బరువును పరీక్షిస్తారు. ఒకవేళ టోల్ ప్లాజాలో ఈ సదుపాయం లేకపోతే ఓవర్‌లోడ్ ఫీజు విధించరు.

ఫాస్టాగ్ ద్వారానే ఫీజు

ఈ కొత్త విధానం ప్రకారం ఓవర్‌లోడ్ ఫీజును కేవలం ఫాస్టాగ్ ద్వారా మాత్రమే వసూలు చేస్తారు. నగదు చెల్లింపులకు అవకాశం ఉండదు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల వివరాలను జాతీయ వాహన రిజిస్టర్ ‘వాహన్’ పోర్టల్‌లో నమోదు చేస్తారు.

రోడ్డు భద్రతే లక్ష్యం

ఈ కొత్త విధానం ద్వారా రహదారులపై ఓవర్‌లోడ్ వాహనాలను తగ్గించడంతో పాటు రోడ్డు ప్రమాదాలను కూడా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో రహదారుల దెబ్బతినడం తగ్గి, సరుకు రవాణా మరింత సురక్షితంగా మారుతుందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com