గత 48 గంటల్లో 6 శత్రు డ్రోన్లను కూల్చివేసిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు

- May 19, 2026 , by Maagulf
గత 48 గంటల్లో 6 శత్రు డ్రోన్లను కూల్చివేసిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు

ఇరాక్ భూభాగం నుంచే డ్రోన్లు వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడి

అబుదాబి: గత 48 గంటల్లో దేశంలోని కీలక ప్రాంతాలు, పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వచ్చిన ఆరు శత్రు డ్రోన్లను (UAVలు) యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకుని కూల్చివేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

అత్యున్నత స్థాయి అప్రమత్తత, సమర్థవంతమైన సాంకేతిక సామర్థ్యాలతో ఈ డ్రోన్లను నిర్వీర్యం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కీలక మౌలిక వసతులకు ఎటువంటి నష్టం కలగలేదని స్పష్టం చేశారు.

మే 17న అల్ ధఫ్రా ప్రాంతంలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై జరిగిన డ్రోన్ దాడిపై కొనసాగుతున్న దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఆ ఘటనలో పాల్గొన్న మూడు డ్రోన్లలో రెండింటిని అడ్డుకున్నప్పటికీ, మూడో డ్రోన్ కేంద్రం వెలుపల ఉన్న విద్యుత్ జనరేటర్‌ను తాకిన విషయం తెలిసిందే.

అదే విధంగా ఆ తరువాత అడ్డుకున్న ఇతర డ్రోన్లు కూడా ఇరాక్ భూభాగం నుంచే ప్రయాణించినట్లు సాంకేతిక పర్యవేక్షణ, ట్రాకింగ్ ద్వారా నిర్ధారణ అయినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

దేశ సార్వభౌమత్వం, జాతీయ భద్రతను కాపాడేందుకు అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాల ప్రకారం అవసరమైన అన్ని చర్యలు తీసుకునే హక్కు యూఏఈకి ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

దేశ భద్రత, జాతీయ ఆస్తులను లక్ష్యంగా చేసుకునే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సాయుధ దళాలు పూర్తిస్థాయి సిద్ధతతో ఉన్నాయని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com