బక్రీద్ ను శాంతియుతంగా జరుపుకోవాలి: సీపీ సుమతి

- May 24, 2026 , by Maagulf
బక్రీద్ ను శాంతియుతంగా జరుపుకోవాలి: సీపీ సుమతి

హైదరాబాద్: బక్రీద్ పండుగను శాంతియుత, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్  బి.సుమతి సూచించారు.

బక్రీద్ పండుగ సందర్భంగా నేరెడ్మెట్‌లోని సీపీ కార్యాలయంలో కమిషనర్ సుమతి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో పాటు ముస్లిం ప్రతినిధులు, గోరక్షక్ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి మున్సిపాలిటీ, వెటర్నరీ, రెవెన్యూ, వాటర్ వర్క్స్, ఫైర్, మెడికల్, రోడ్డు రవాణా శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీపీ సుమతి మాట్లాడుతూ బక్రీద్ వంటి ముఖ్యమైన పండుగలను పరస్పర సహకారంతో జరుపుకోవడం సమాజ ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. పండుగ రోజుల్లో ఎలాంటి అపోహలు, వదంతులు వ్యాప్తి చెందకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు.

అనుమానాస్పద వాహనాలు, అక్రమ రవాణా లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు.

గోవులను తరలించే వాహనాలను అడ్డుకోవడం, వ్యక్తులపై దాడులు చేయడం, బలవంతపు తనిఖీలు నిర్వహించడం వంటి చర్యలకు పాల్పడరాదని గోరక్షక్ సభ్యులకు సూచించారు. అనుమానాస్పద ఘటనలు గమనిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

ప్రభుత్వం అనుమతించిన ప్రదేశాల్లోనే జంతు వధ నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాల్లో జంతు అవశేషాలు వేయకుండా పరిశుభ్రత పాటిస్తూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ప్రజలను కోరారు.

ఈ సమావేశంలో ఎల్‌బీనగర్ డీసీపీ అనురాధ ఐపీఎస్, మల్కాజిగిరి డీసీపీ సీహెచ్ శ్రీధర్, ఉప్పల్ డీసీపీ సురేష్, ఎస్‌బీ డీసీపీ జి నరసింహారెడ్డి, ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషారాణి, అడ్మిన్ డీసీపీ ఇందిరా, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు, హెడ్‌క్వార్టర్ డీసీపీ శ్యాంసుందర్, అదనపు డీసీపీలు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com