క్వెట్టా రైల్వే స్టేషన్‌లో ఘోర ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి

- May 24, 2026 , by Maagulf
క్వెట్టా రైల్వే స్టేషన్‌లో ఘోర ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి

పాకిస్తాన్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. బలూచిస్తాన్ క్వెట్టా (Quetta) రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం చోటుచేసుకున్న ఒక శక్తివంతమైన ఆత్మాహుతి బాంబు దాడిలో కనీసం 23 మంది మరణించగా, మరో 50 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పెషావర్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్న ‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’ (Jaffar Express) రైలును లక్ష్యంగా చేసుకుని దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. పేలుడు సంభవించిన సమయంలో ప్లాట్‌ఫాంపై వందలాది మంది ప్రయాణికులు ఉండటంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రైల్వే అధికారులు మరియు స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం.. ప్రయాణికులు రైలు ఎక్కుతున్న సమయంలో ప్లాట్‌ఫాంపై ఉన్న బుకింగ్ ఆఫీస్ సమీపంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో దుండగుడు ఐఈడీ (Improvised Explosive Device) ఉపయోగించినట్లు భద్రతా బలగాలు ప్రాథమికంగా గుర్తించాయి. పేలుడు ధాటికి జాఫర్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఒక రైలు బోగీతో పాటు, రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. ఈ భీకర పేలుడు శబ్దానికి క్వెట్టా నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఈ ఘోర ఉగ్రదాడికి తామే బాధ్యులమంటూ నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ’ (BLA) అధికారికంగా ప్రకటించుకుంది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకునే ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు బీఎల్ఏ అనుబంధ విభాగం పేర్కొంది. కాగా, సమాచారం అందుకున్న వెంటనే పాక్ సైన్యం, రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగి గాయపడిన వారిని క్వెట్టాలోని సీఎంహెచ్ (CMH) ఆసుపత్రికి తరలించారు. బలూచిస్తాన్ ప్రభుత్వం క్వెట్టాలోని అన్ని ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితిని (Emergency) విధించి తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com