తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు నో పర్మిషన్..

- June 01, 2026 , by Maagulf
తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు నో పర్మిషన్..

హైదరాబాద్: తెలంగాణలో జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’కు అనుమతి నిరాకరించడం రాజకీయంగా దుమారం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని, కావాలనే తమ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని జనసేన నాయకత్వం తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వ చర్య పూర్తిగా అర్ధరహితమని పార్టీ వర్గాలు ధ్వజమెత్తాయి.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ హాల్‌లో ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్ సమ్మేళనం’ పేరిట ఓ అంతర్గత సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జనసేన భావించింది. సుమారు 2000 మంది ముఖ్య కార్యకర్తలతో కలిసి రాష్ట్ర అభివృద్ధిలో పార్టీ పాత్ర, భవిష్యత్తు వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చించేందుకు ఈ వేదికను సిద్ధం చేశారు. అయితే, చివరి నిమిషంలో పార్కింగ్ ఇబ్బందులను సాకుగా చూపుతూ అధికారులు ఈ సభకు పర్మిషన్ నిరాకరించడం గమనార్హం.

ప్రభుత్వ తీరుపై జనసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ వందలాది కార్పొరేట్, రాజకీయ, సాంస్కృతిక ఈవెంట్లు జరిగే సంధ్య కన్వెన్షన్‌లో.. కేవలం జనసేన కార్యక్రమానికి మాత్రమే పార్కింగ్ సమస్య ఎలా వస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కావాలని చేస్తున్న రాజకీయం కాదా అని నిలదీస్తున్నారు.

ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలకు సంబంధించిన వివాదం ఇప్పటికే ముగిసిపోయిందని, ఆయనే స్వయంగా తన మాటలను వెనక్కి తీసుకున్నారని జనసేన గుర్తుచేసింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు ఉండవని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గతంలోనే స్పష్టం చేశారు. అలాంటప్పుడు, క్లోజ్ అయిపోయిన చాప్టర్‌ను సాకుగా చూపి తెలంగాణలో తమ సభను అడ్డుకోవడం ఏంటని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com