కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- June 19, 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేశ్ కోల్కతాలో పర్యటించారు. అక్కడ పలు రంగాలకు చెందిన దేశీయ పారిశ్రామిక దిగ్గజాలతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఎలక్ట్రిక్ వాహనాలు (EV), పునరుత్పాదక ఇంధనం, ఉక్కు, అల్యూమినియం, ఆగ్రో-ప్రాసెసింగ్ వంటి కీలక రంగాలలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని, కొత్త పరిశ్రమలు స్థాపించాలని వారికి పిలుపునిచ్చారు.
గ్రీన్ ఎనర్జీ, ఈవీ రంగాల పై ప్రత్యేక ఫోకస్: రాయలసీమలో సోలార్ హబ్!
భవిష్యత్ అవసరాలైన హరిత ఇంధనం, ఈవీ టెక్నాలజీపై మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ సీఎండీ అనురాగ్ చౌదరితో జరిగిన భేటీలో.. నెల్లూరు లేదా చిత్తూరు ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లలో సిలికాన్-కార్బన్ యానోడ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని కోరారు. దక్షిణ భారతదేశ ఈవీ తయారీ హబ్గా ఏపీని మార్చడమే తమ సంకల్పమని స్పష్టం చేశారు. అలాగే, ఐఐటీ తిరుపతి లేదా ఆంధ్రా యూనివర్సిటీతో కలిసి అమరావతిలో అడ్వాన్స్డ్ మెటీరియల్ ల్యాబ్ను నిర్మించాలని ప్రతిపాదించారు.
మరోవైపు, విక్రమ్ సోలార్ చైర్మన్ జ్జానేష్ చౌదరి, సీఈఓ అరుణ్ మిట్టల్లతో చర్చలు జరిపిన లోకేశ్.. రాయలసీమ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ సోలార్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. రాబోయే ఐదేళ్లలో 78.5 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని అందుకోవడం, రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా దాదాపు 7.5 lakhs ఉద్యోగాలను సృష్టించడమే ఏపీ ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. రిలయన్స్, ఎస్ఏఈఎల్ వంటి సంస్థలు ఇప్పటికే రాయలసీమలో తమ ప్రాజెక్టులను ప్రారంభించాయని ఆయన గుర్తుచేశారు.
అమరావతి పునర్నిర్మాణం.. ఉక్కు, అల్యూమినియం పరిశ్రమలకు పెరిగిన డిమాండ్
రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభం మరియు మౌలిక వసతుల కల్పనతో ఏపీలో ఉక్కు, నిర్మాణ సామగ్రికి భారీ డిమాండ్ ఏర్పడిందని మంత్రి వివరించారు. ఈ క్రమంలో శ్యామ్ మెటాలిక్స్, సూపర్ స్మెల్టర్స్, రష్మీ మెటాలిక్స్ ప్రతినిధులను లోకేశ్ వేర్వేరుగా కలిశారు. కృష్ణపట్నం, గంగవరం, వైజాగ్ పోర్టుల అనుకూలతలను వారికి వివరించారు.
శ్యామ్ మెటాలిక్స్: ఈవీ-గ్రేడ్ అల్యూమినియం తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని కోరారు.
సూపర్ స్మెల్టర్స్: విజయనగరంలో ప్రతిపాదిత స్టీల్ ప్లాంట్ సామర్థ్యాన్ని 2 ఎంటీపీఏ (MTPA)కు పెంచాలని, స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
రష్మీ మెటాలిక్స్: విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ (VCIC) పరిధిలో ఇంటిగ్రేటెడ్ స్టీల్, డక్టైల్ ఐరన్ పైపుల తయారీ ప్లాంట్ను నిర్మించాలని ప్రతిపాదించారు.
వ్యవసాయం, పర్యాటక రంగాలపై ఐటీసీతో చర్చలు
ప్రముఖ కార్పొరేట్ సంస్థ ఐటీసీ (ITC) చైర్మన్ సంజీవ్ పూరితో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, హాస్పిటాలిటీ (పర్యాటక) రంగాల విస్తరణపై లోకేశ్ చర్చించారు. వాతావరణ మార్పులను తట్టుకునే సరికొత్త వంగడాల సృష్టిలో మరియు క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్లలో ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలని కోరారు. ఏపీలో ఇప్పటికే తమకు బలమైన వ్యాపారాలు ఉన్నాయని, ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని సంజీవ్ పూరితో పాటు మిగిలిన పారిశ్రామికవేత్తలు మంత్రి లోకేశ్కు హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్
- యెమెన్ సముద్ర జలాల్లో మునిగిన భారత కార్గో నౌక..
- 18 ఏళ్లకే గిన్నిస్ రికార్డు సృష్టించిన యువ ప్రొఫెసర్ నాథన్ థామస్
- గుజరాత్లో విజృంభిస్తున్న చాందీపురా వైరస్
- ఇక ఇంటింటికీ ఇంటర్నెట్.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
- దుబాయ్ కార్ షోరూమ్ పేలుడు ఘటనలో మృతి చెందినది భారతీయుడే..
- టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ హఠాన్మరణం







