ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు, ద‌ర్శ‌కుడు కె.భాగ్య‌రాజ్ క‌న్నుమూత‌

- June 27, 2026 , by Maagulf
ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు, ద‌ర్శ‌కుడు కె.భాగ్య‌రాజ్ క‌న్నుమూత‌

చెన్నై: సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ చిత్రనిర్మాత, నటుడు, రచయిత కె.భాగ్యరాజ్ క‌న్నుమూశారు. గుండెపోటుతో ఈ రోజు (జూన్ 27 శ‌నివారం) చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 73 సంవ‌త్స‌రాలు.

తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో కృష్ణస్వామి భాగ్యరాజ్‌గా జన్మించిన ఆయన, ప్రముఖ దర్శకుడు భారతీరాజా వద్ద సహాయ దర్శకుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. అనంతరం తనదైన శైలితో దర్శకుడిగా, రచయితగా, నటుడిగా విశేష గుర్తింపు పొందారు. ముఖ్యంగా 1980, 1990 దశకాల్లో మధ్యతరగతి కుటుంబాల జీవితాలను ప్రతిబింబించే కథలు, భావోద్వేగభరితమైన సన్నివేశాలు, పదునైన స్క్రీన్‌ప్లేలతో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.

భాగ్యరాజ్ తన సినీ జీవితంలో 25కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించగా, 75కిపైగా సినిమాల్లో నటించారు. తమిళ సినీ పరిశ్రమలో అత్యుత్తమ కథా రచయితల్లో ఒకరిగా ఆయన పేరు చిరస్థాయిలో నిలిచిపోతుంది. సాధారణ ప్రజల జీవితాలకు దగ్గరగా ఉండే పాత్రలు, హృదయాన్ని తాకే కథనాలు, వినోదంతో పాటు సామాజిక అంశాలను మేళవించే ఆయన రచనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

‘ముందానై ముడిచ్చు’, ‘అందా 7 నాట్కల్’, ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’ వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో చిరస్మరణీయమైన క్లాసిక్‌లుగా నిలిచాయి. ఆయన ప్రతిభను గుర్తించిన మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) సినీ పరిశ్రమలో తన వారసుడిగా భాగ్యరాజ్‌ను ప్రశంసించడం ఆయన స్థాయిని తెలియజేస్తుంది.

తమిళంతో పాటు హిందీ చిత్రసీమలో కూడా ఆయన తన ముద్ర వేశారు. అమితాబ్ బచ్చన్ ద్విపాత్రాభినయం చేసిన ‘ఆఖ్రీ రాస్తా’ చిత్రానికి దర్శకత్వం వహించి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. భాగ్యరాజ్ మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఒక గొప్ప సృజనాత్మక మేధావిని కోల్పోయింది. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ సినీ ప్రముఖులు, అభిమానులు ఘన నివాళులు అర్పిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com