బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్

- June 27, 2026 , by Maagulf
బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్

మనామా: బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ నిర్వహించిన డ్రోన్ దాడులను బహ్రెయిన్ ప్రభుత్వం శనివారం తీవ్రంగా ఖండించింది. ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఈ తరహా దాడులు శాంతి ప్రయత్నాలను దెబ్బతీస్తున్నాయని, ఇందుకు పూర్తి బాధ్యత తెహ్రాన్‌పైనే ఉందని పేర్కొంది.

బహ్రెయిన్ ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థలో విడుదల చేసిన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, బహ్రెయిన్ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని "అనేక ఇరానియన్ డ్రోన్లు" దాడికి పాల్పడ్డాయి. ఈ చర్య దేశ సార్వభౌమాధికారాన్ని బహిరంగంగా ఉల్లంఘించడమే కాకుండా, పౌరులు మరియు నివాసితుల భద్రతకు తీవ్రమైన ముప్పుగా నిలుస్తుందని పేర్కొంది. అలాగే ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా కూడా అభివర్ణించింది.

దేశ సార్వభౌమాధికారం, భద్రతను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునే పూర్తి హక్కు తమకు ఉందని బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, ఇరాన్ అంతకుముందు అమెరికా బలగాలకు సంబంధించిన లక్ష్యాలపై ప్రాంతంలో దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. అయితే ఆ దాడులు ఎక్కడ జరిగాయి, ఏ లక్ష్యాలను ఉద్దేశించి చేపట్టాయనే వివరాలను వెల్లడించలేదు.

ఈ పరిణామాలతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న మిడిల్ ఈస్ట్ పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారే అవకాశాలపై అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com