35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- July 08, 2026
దుబాయ్: దుబాయ్ నుంచి తిరువనంతపురానికి వెళ్తున్న విమానంలో 35 వేల అడుగుల ఎత్తులో ఓ మహిళ అస్వస్థతకు గురికాగా, యూఏఈలో పనిచేస్తున్న భారతీయ నర్సు పూజా రాజకుమారన్ తన సమయస్ఫూర్తితో ఆమెకు వైద్య సహాయం అందించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
జూలై 1న స్వదేశానికి బయలుదేరిన పూజా రాజకుమారన్, విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్యాబిన్ క్రూ "విమానంలో డాక్టర్ లేదా నర్సు ఎవరైనా ఉన్నారా?" అంటూ చేసిన ప్రకటన విన్న వెంటనే స్పందించారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన సీటు నుంచి లేచి బాధితురాలి వద్దకు వెళ్లారు.
ఆమె తెలిపిన వివరాల ప్రకారం, రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్స (మాస్టెక్టమీ) అనంతరం దుబాయ్లో ఫిజియోథెరపీ చేయించుకుని స్వదేశానికి వెళ్తున్న వీల్చైర్ ప్రయాణికురాలు స్పృహ కోల్పోయే స్థితిలో ఉండగా, పల్స్ బలహీనంగా ఉండటంతో పాటు చేతులు చల్లబడిపోయి వణుకుతున్నాయని గుర్తించారు.
రాస్ అల్ ఖైమా (RAK) హాస్పిటల్లోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో పనిచేస్తున్న పూజా, దాదాపు మొత్తం ప్రయాణ సమయంలో బాధితురాలి వద్దే ఉండి పల్స్ను నిరంతరం పరిశీలించారు. ఆమెను అప్రమత్తంగా ఉంచేందుకు మాట్లాడుతూనే, నీరు తాగించి శరీరంలో తేమ నిల్వ ఉండేలా చూసారు. రక్తప్రసరణ మెరుగుపడేందుకు చేతులను మృదువుగా రుద్దుతూ వెచ్చదనం కల్పించారు.
ఈ సందర్భంగా విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించాలా అని క్యాబిన్ క్రూ ప్రశ్నించగా, మరోసారి పరీక్షించిన అనంతరం పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని, ఇది ప్రాణాపాయం కంటే తీవ్రమైన శారీరక అలసట, ఆందోళన కారణంగా ఏర్పడిన సమస్యగా భావిస్తున్నట్లు పూజా తెలిపారు. ఆమె అంచనా మేరకు విమానం గమ్యస్థానానికి యథావిధిగా ప్రయాణం కొనసాగించింది.
విమాన సిబ్బంది పూర్తిగా సహకరించారని, వెంటనే నీరు, దుప్పటి అందించడంతో పాటు తన సూచనలను పాటించారని పూజా తెలిపారు. అలాగే ఇతర ప్రయాణికులు కూడా ఎలాంటి భయాందోళనకు గురికాకుండా సహకరించడం వల్ల పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోగలిగామని చెప్పారు.
విమానం ల్యాండింగ్కు ముందు మరోసారి బాధితురాలిని పరిశీలించగా, ఆమె కోలుకుని చిరునవ్వుతో తనకు కృతజ్ఞతలు తెలిపిందని పూజా చెప్పారు. "ఆమె సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవడమే నాకు లభించిన గొప్ప బహుమతి" అని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆరోగ్య రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ముందుకు వచ్చి సహాయం చేయాలని పూజా సూచించారు. అలాగే ప్రయాణికులు కూడా విమానంలో వైద్య అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రశాంతంగా ఉండి, క్యాబిన్ సిబ్బందికి, వైద్య నిపుణులకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు







