సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ

- July 11, 2026 , by Maagulf
సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ

హైదరాబాద్: ప్రముఖ అంతర్జాతీయ విమానయాన దిగ్గజం ‘ఎమిరేట్స్’ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్థన్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగిన ఈ భేటీకి ఒక ప్రత్యేకత ఉంది. ఎమిరేట్స్ వైమానిక సంస్థ అంతర్జాతీయంగా తన సేవల విస్తరణలో 25వ వసంతంలోకి (వార్షికోత్సవం) అడుగుపెడుతున్న శుభతరుణంలో ఈ కీలక చర్చలు జరిగాయి.

హైదరాబాద్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద ‘ఏ-380’ విమానాలు
తెలంగాణలో విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా, రాష్ట్రానికి ఎమిరేట్స్ నడిపే విమాన సర్వీసుల సంఖ్యను పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తికి ఎమిరేట్స్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలోనే భాగ్యనగరానికి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, భారీ ప్యాసింజర్ విమానంగా పేరొందిన ‘ఏ-380’ (A-380) సర్వీసులను ప్రారంభించేందుకు ఎమిరేట్స్ సంస్థ బలమైన ఆసక్తిని కనబరిచింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, సర్వీసులు విస్తరించేందుకు వచ్చే ఎమిరేట్స్ సంస్థకు ప్రభుత్వం తరఫున కావాల్సిన అన్ని వసతులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

గచ్చిబౌలి స్పోర్ట్స్ యూనివర్సిటీకి స్పాన్సర్‌షిప్
కేవలం విమానయాన రంగమే కాకుండా, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కూడా ఈ భేటీ వేదికైంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఆర్థికంగా లేదా ప్రమోషన్ పరంగా స్పాన్సర్‌షిప్ అందించాలని రేవంత్ రెడ్డి కోరారు. అంతర్జాతీయ క్రీడా జట్లకు, ఈవెంట్లకు స్పాన్సర్‌గా వ్యవహరించే ఎమిరేట్స్ సంస్థ.. సీఎం చేసిన ఈ ప్రతిపాదనపై కూడా సానుకూల ముగ్గు చూపింది.

వరంగల్, ఆదిలాబాద్‌లలో కొత్త విమానాశ్రయాలు
రాష్ట్రంలో త్వరలోనే వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలలో సరికొత్త విమానాశ్రయాల (ఎయిర్‌పోర్టులు) నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. ఈ జిల్లాల్లో కొత్త ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కనెక్టివిటీని పెంచేందుకు ఎమిరేట్స్ వంటి అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం ఎంతో ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com