కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!

- July 13, 2026 , by Maagulf
కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!

కువైట్ సిటీ: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న దాడుల ప్రతిదాడుల నేపథ్యంలో కువైట్ దేశంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కువైట్ ఉత్తర సరిహద్దుల్లోని మూడు చెక్‌పోస్టులతో పాటు సముద్ర తీరంలోని ఒక చమురు క్షేత్రం (ఆఫ్‌షోర్ ఆయిల్ ప్లాట్‌ఫారమ్) లక్ష్యంగా దాడులు జరిగినట్లు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) అధికారికంగా ప్రకటించింది.

కువైట్ ప్రాదేశిక జలాల్లో ఉన్న 'కువైట్ ఆయిల్ కంపెనీ' కి చెందిన ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్ ప్లాట్‌ఫారమ్‌పై శత్రు డ్రోన్ దాడి చేసిందని రక్షణ శాఖ అధికారిక ప్రతినిధి వెల్లడించారు. ఈ దాడిలో చమురు క్షేత్రానికి ఆస్తి నష్టం వాటిల్లడమే కాకుండా, అక్కడ పనిచేస్తున్న ఒక కార్మికుడు గాయపడ్డాడని, ప్రస్తుతం అతనికి ఆసుపత్రిలో అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అలాగే ఉత్తర సరిహద్దు కేంద్రాలపై జరిగిన దాడుల్లో కూడా భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు పేర్కొన్నారు.
దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడేందుకు తమ సైన్యం పూర్తి సన్నద్ధతతో ఉందని, శత్రువుల నుండి దేశ భూభాగాన్ని రక్షించడానికి అవసరమైన అన్ని కఠిన చర్యలు తీసుకుంటామని కువైట్ సాయుధ దళాలు స్పష్టం చేశాయి. అంతకుముందు కువైట్ వైమానిక పరిధిలోకి ప్రవేశించిన కొన్ని శత్రు డ్రోన్లు, క్షిపణులను కువైట్ సైన్యం విజయవంతంగా అడ్డుకుందని తెలిపారు.

అమెరికా జరుపుతున్న వరుస దాడులకు సమాధానంగానే తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఇరాన్ (టెహ్రాన్) ప్రకటించింది. ఇందులో భాగంగానే కువైట్‌తో పాటు బహ్రెయిన్, ఖతార్, ఒమన్, మరియు జోర్డాన్ వంటి పలు ప్రాంతీయ దేశాలపై ఇరాన్ దాడులకు తెగబడింది. హార్ముజ్ జలసంధిలో (Strait of Hormuz) నౌకల రాకపోకలపై ఇరాన్ విధిస్తున్న ఆంక్షలు, దానికి ప్రతిగా అమెరికా జరుపుతున్న ప్రతీకార దాడుల వల్ల ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com