పీసా టవర్‌పై దాడి చేసేందుకు కుట్ర

- August 13, 2016 , by Maagulf
పీసా టవర్‌పై దాడి చేసేందుకు కుట్ర

ప్రపంచ వింతల్లో ఒకటైన 'లీనింగ్‌ టవర్‌ ఆఫ్‌ పీసా'పై ఉగ్రవాదులు దాడి చేయాలని కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఇటలీలోని ప్రఖ్యాత పీసా టవర్‌కు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ కట్టడం ఓ పక్కకు ఒరిగి పడిపోకుండా ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి సాధించిన సంగతి తెలిసిందే. ఇక్కడికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇటీవల ఇటలీలో బైలెల్‌ చియహోయి అనే 26ఏళ్ల ట్యునీషియన్‌ వ్యక్తి యూరప్‌లో జరిగిన ఉగ్రవాద దాడులను ప్రశంసిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. విచారణలో అతడు పీసా టవర్‌పై దాడి చేసేందుకు కుట్ర పన్నినట్లు వెల్లడైందని అక్కడి మీడియా వెల్లడించింది.ఈ ట్యునీషియన్‌ దేశస్థుడిని వెంటనే ఇటలీ నుంచి బహిష్కరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అందుకు సంబంధించిన పత్రాలపై న్యాయమూర్తి కూడా సంతకం చేసినట్లు పోలీసులు తెలిపారు. కానీ అతడు ఇటలీలో దాడులకు కుట్ర చేశాడనే అంశానికి సంబంధించి పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇటీవల ఫ్రాన్స్‌, బెల్జియం దేశాల్లో ఉగ్రదాడులు జరిగిన నేపథ్యంలో ఇటలీలో దాడులు జరిగే అవకాశం ఉండొచ్చని అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఇటలీ అంతర్గత మంత్రి ఆంజెలినో అల్ఫానో ఆదేశాల మేరకు ట్యునీషియన్‌ వ్యక్తిని దేశ బహిష్కరణ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com