కువైట్ సహా నాలుగు దేశాల్లో భారత కాన్సులర్ సేవలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు.!!

- July 16, 2026 , by Maagulf
కువైట్ సహా నాలుగు దేశాల్లో భారత కాన్సులర్ సేవలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు.!!

న్యూఢిల్లీ: కువైట్‌తో పాటు యూఏఈ (అబుదాబి), సింగపూర్, ఆస్ట్రేలియా (కాన్‌బెరా)లోని భారత రాయబార కార్యాలయాల్లో పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ (CPV) సేవల ఔట్‌సోర్సింగ్‌కు సంబంధించిన టెండర్ ప్రక్రియను ఢిల్లీ హైకోర్టు రద్దు చేసింది. ఈ సేవల కోసం ఒక నెలలోపు కొత్త రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (RFP) జారీ చేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)ను ఆదేశించింది. టెండర్‌లో సాంకేతిక బిడ్ల ఇవాల్యుయేషన్ చట్టపరంగా నిలబడదని కోర్టు పేర్కొంటూ, ఇప్పటికే ఎంపికైన సంస్థలకు ఇచ్చిన కాంట్రాక్టులను కూడా రద్దు చేసింది.ఈ కేసులో ఈ ట్రావ్ టెక్ లిమిటెడ్ మరియు వెరాసిస్ సిస్టమ్స్ సంస్థలు టెండర్  ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ అనంతరం కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

అయితే, కొత్త టెండర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పాస్‌పోర్ట్, వీసా, ఇతర కాన్సులర్ సేవలకు అంతరాయం కలగకుండా ప్రస్తుతం సేవలు అందిస్తున్న సంస్థ కొనసాగవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో కువైట్‌లో భారత రాయబార కార్యాలయానికి కొత్త ఔట్‌సోర్సింగ్ సేవల సంస్థ నియామకం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇంతకుముందు డూడిజిటల్ గ్లోబల్ ( DuDigital Global) సంస్థను ఈ సేవల కోసం ఎంపిక చేసి, జూలై 1 నుంచి బాధ్యతలు స్వీకరించాల్సి ఉండగా, టెండర్‌పై న్యాయపరమైన వివాదాలు తలెత్తడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు హైకోర్టు టెండర్‌ను రద్దు చేయడంతో, కొత్త టెండర్ పూర్తయ్యే వరకు ఆ నియామకం అమల్లోకి రాదని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com