భారత్–బహ్రెయిన్ భాగస్వామ్యం మరింత బలోపేతం..!!
- July 17, 2026
మనామా: భారత్–బహ్రెయిన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతమవుతోంది. ముఖ్యంగా దౌత్యం, వాణిజ్యం, కాన్సులర్ సేవలు, సముద్ర భద్రత వంటి కీలక రంగాల్లో మరింత బలోపేతమవుతోందని బహ్రెయిన్లో భారత రాయబారి వినోద్ కె. జాకబ్ తెలిపారు. మనామాలోని భారత రాయబార కార్యాలయంలో ఈమేరకు ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
భారత విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్ జూలై 6–7 తేదీల్లో బహ్రెయిన్ను సందర్శించారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫా, యువరాజు, ప్రధాని ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, ఉప ప్రధాని షేక్ ఖాలిద్ బిన్ అబ్దుల్లాలను కలిశారు. అలాగే విదేశాంగ మంత్రి డా. అబ్దుల్లతీఫ్ అల్ జయానీతో సమావేశమై ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారంపై చర్చించారు.
1.66 బిలియన్ డాలర్లకు చేరిన ద్వైపాక్షిక వాణిజ్యం
2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత్–బహ్రెయిన్ ద్వైపాక్షిక వాణిజ్యం 1.66 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరి, గత ఏడాదితో పోలిస్తే 1.57 శాతం వృద్ధి నమోదైంది. ఇరు దేశాల పరస్పర పెట్టుబడుల విలువ సుమారు 2 బిలియన్ డాలర్లుగా ఉంది. ద్వంద్వ పన్ను నివారణ ఒప్పందం (DTAA)పై తొలి విడత చర్చలు జూలై 2026లో ప్రారంభమయ్యాయి.
ఈ-వీసా, కాన్సులర్ సేవలకు మంచి స్పందన
బహ్రెయిన్ ఈ-వీసా సేవ ప్రారంభమైన రెండో ఏడాదిలోనే 14 విభాగాల్లో 4,651 వీసాలు జారీ చేసింది. బహ్రెయిన్ మాల్లోని భారత కాన్సులర్ సెంటర్ ఆగస్టు 2025 నుంచి ఇప్పటివరకు 39 వేలకుపైగా దరఖాస్తులను పరిష్కరించింది. వీటిలో పాస్పోర్ట్ పునరుద్ధరణలు, అటెస్టేషన్లు, ఓసీఐ కార్డులు ఉన్నాయి. అలాగే తత్కాల్ పాస్పోర్ట్ సేవలు 2026 ఏప్రిల్లో తిరిగి ప్రారంభమయ్యాయి.
సముద్ర భద్రతలో భారత్కు కీలక బాధ్యత
2026 ఫిబ్రవరిలో భారత్ తొలిసారిగా కంబైన్డ్ టాస్క్ ఫోర్స్–154 కమాండ్ను చేపట్టింది. ఈ సందర్భంగా భారత నౌకాదళం 25 భాగస్వామ్య దేశాలకు 2,200 గంటలకు పైగా సముద్ర భద్రతా శిక్షణ అందించింది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి స్థానానికి భారత్ ప్రచారం
2028–29 కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ తన ప్రచారాన్ని ప్రారంభించింది. "శాంతి (SHANTI)" అనే కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రాతినిధ్యం, ఉగ్రవాద నిర్మూలనకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రచారాన్ని కొనసాగిస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!
- భారత్–బహ్రెయిన్ భాగస్వామ్యం మరింత బలోపేతం..!!







