ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..

- July 20, 2026 , by Maagulf
ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా త్వరలోనే విద్యార్థులకు ముద్దగా లేని, చక్కటి ‘స్టీమ్ రైస్’ సరఫరా చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఆహార నాణ్యతను పరిశీలించేందుకు ఆయన మంగళగిరిలోని అక్షయపాత్ర కేంద్రాన్ని స్వయంగా సందర్శించారు.

పాఠశాలల్లో అన్నం సరిగ్గా ఉడకడం లేదని, ముద్దగా వస్తోందనే ఫిర్యాదులపై మంత్రి తక్షణమే స్పందించారు. కొత్త బియ్యం వల్ల ఈ సమస్య వస్తోందని సిబ్బంది వివరించగా, సరఫరా అవుతున్న బియ్యం నాణ్యతపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను (AP Government)ఆదేశించారు. రాష్ట్రంలోని 63 వేల స్కూళ్ల విద్యార్థులందరికీ నాణ్యమైన ఆహారమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల ఆకలి తీర్చడంలో అక్షయపాత్ర ఫౌండేషన్ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

2000 సంవత్సరంలో బెంగళూరులో కేవలం 1,500 మంది పిల్లలతో ప్రారంభమైన అక్షయపాత్ర ప్రస్థానం, నేడు 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రోజూ 23.50 లక్షల మందికి భోజనం అందించే స్థాయికి చేరింది. పీఎం పోషణ్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 500 కోట్ల భోజనాలను పంపిణీ చేసి ఈ సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏపీ, తెలంగాణ సహా దేశంలోని లక్షలాది మంది పేద విద్యార్థుల ఆకలి తీరుస్తూ, బడుల్లో హాజరు శాతాన్ని పెంచడంలో ఈ సంస్థ అగ్రగామిగా నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com