రేపే ఏపీకి ప్రధాని మోదీ..

- July 31, 2026 , by Maagulf
రేపే ఏపీకి ప్రధాని మోదీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఏపీలోని విజయనగరం జిల్లా భోగాపురం కేంద్రంగా రూ.17,900 కోట్లకు పైగా విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారిక ప్రకటన విడుదల చేసింది.

విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల ఆర్థిక రూపురేఖలను మార్చేలా ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ఈ పర్యటనలో ప్రధాని(Narendra Modi) ప్రారంభించే, శంకుస్థాపన చేసే ప్రధాన ప్రాజెక్టుల వివరాలు ఇవే.

గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం: రూ.5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన ‘భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభం.

సెమీకండక్టర్ ప్లాంట్: విశాఖపట్నంలో రూ.460 కోట్లతో ఏపీలోనే తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన. దీని ద్వారా ఏటా 9.6 కోట్ల (96 మిలియన్ల) చిప్‌ల ఉత్పత్తి లక్ష్యం.

విద్యుత్ ప్రసార ప్రాజెక్టులు: రూ.5,550 కోట్లతో కర్నూలు-IV పునరుత్పాదక ఇంధన జోన్ ప్రసార వ్యవస్థకు శంకుస్థాపన. అలాగే కర్నూలు, అనంతపురం సోలార్-విండ్ ఎనర్జీ జోన్లకు సంబంధించి రూ.3,550 కోట్లు, రూ.820 కోట్ల విలువైన ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టుల ప్రారంభం.

జాతీయ రహదారులు: రూ.1,880 కోట్లకు పైగా విలువైన రహదారి ప్రాజెక్టులకు శ్రీకారం. వీటి వల్ల విజయవాడలో ట్రాఫిక్ తగ్గడంతో పాటు విశాఖ-హైదరాబాద్ ప్రయాణ సమయం చాలా వరకు తగ్గనుంది.

ఆంధ్రప్రదేశ్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ కర్ణాటకకు వెళ్లనున్నారు. అక్కడ మైసూర్ నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం’ను ప్రారంభించి, అనంతరం అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com