ఎండలో కార్మికుడు కుప్పకూలితే ఏం చేయాలి? బహ్రెయిన్లో ప్రత్యేక శిక్షణ..!!
- August 12, 2026
మనామా: అధిక ఉష్ణోగ్రతల్లో పనిచేసే సమయంలో వడదెబ్బకు గురైన సహోద్యోగిని ఎలా గుర్తించాలి? అతడు కుప్పకూలితే వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై బహ్రెయిన్లో కార్మికులకు ప్రత్యేక అవగాహన, ప్రాక్టికల్ శిక్షణ అందించారు. ఈస్ట్ సిత్రా హౌసింగ్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 120 మందికి పైగా కార్మికులకు హీట్ స్ట్రెస్, హీట్ స్ట్రోక్ లక్షణాలను గుర్తించడం, అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించడం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. బహ్రెయిన్ ఫ్రీ లేబర్ యూనియన్స్ ఫెడరేషన్కు చెందిన ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎండలో పనిచేయడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ఫెడరేషన్ నిర్వహిస్తున్న వార్షిక ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇది జరిగింది.
పలు భాషల్లో శిక్షణ నిర్వహించారు. హీట్ స్ట్రెస్కు సంబంధించిన హెచ్చరిక సంకేతాలను ఎలా గుర్తించాలి, సహోద్యోగి వేడికి గురై కుప్పకూలినప్పుడు అత్యవసర సాయం వచ్చే వరకు ఎలాంటి ప్రాథమిక చర్యలు తీసుకోవాలి అనే విషయాలను వివరించారు. అలాగే షిఫ్ట్ సమయంలో తాగునీరు చల్లగా ఉండేలా ఇన్సులేటెడ్ వాటర్ బాటిళ్లు, శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు కూలింగ్ టవల్స్ కూడా కార్మికులకు అందించారు.
కార్మికుల ఆరోగ్యం, భద్రత తమ ఫెడరేషన్ ప్రధాన ప్రాధాన్యతల్లో ఒకటని బహ్రెయిన్ ఫ్రీ లేబర్ యూనియన్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు యాకూబ్ యూసిఫ్ మహమ్మద్ తెలిపారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కార్మికులను ప్రమాదాల నుంచి రక్షించడంతో పాటు వారి స్థిరత్వాన్ని, విధులను సమర్థవంతంగా నిర్వర్తించే సామర్థ్యాన్ని పెంచుతాయని ఆయన పేర్కొన్నారు. బహ్రెయిన్లో అమలులో ఉన్న మధ్యాహ్న పనుల నిషేధం నేపథ్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జూన్ 15 నుంచి ఆగస్టు 31 వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో, నేరుగా ఎండలో పనిచేయడాన్ని నిషేధించారు.
తాజా వార్తలు
- అబుదాబి మాల్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ సందర్శన
- జెన్జీ ఎఫెక్ట్తో కొత్త పార్టీ.. నేతాజీ వారసుడి సంచలన ప్రకటన
- సీఎం రేవంత్రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారు
- కువైట్లో ఆగస్టు 27న ప్రభుత్వ సెలవు..!!
- ఎండలో కార్మికుడు కుప్పకూలితే ఏం చేయాలి? బహ్రెయిన్లో ప్రత్యేక శిక్షణ..!!
- ఒమన్లో త్వరలో ‘కన్స్యూమర్ పాస్పోర్ట్’ సర్వీస్..!!
- 183కి పైగా దేశాల్లో యూఏఈ ‘జైవాన్’ కార్డుల వినియోగం..!!
- డీప్ఫేక్లపై ఖతార్ హోంశాఖ హెచ్చరిక..!!
- రెస్టారెంట్లలో ఉల్లంఘనలపై కెమెరాలతో నిఘా..!!
- న్యాయ వ్యవస్థలో వేగం కోసం అన్ని విభాగాల సమన్వయం అవసరం: డీజీపీ సీవీ ఆనంద్







