మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!

- August 21, 2026 , by Maagulf
మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!

మనామా: బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్, పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురానుంది. 18 ఏళ్లలోపు వారికి పొగాకు, వేప్, ఎలక్ట్రానిక్ షిషా ఉత్పత్తులను విక్రయించే దుకాణాలకు గరిష్ఠంగా BD1,000 జరిమానా విధించేలా బిల్లును సిద్ధం చేస్తున్నారు. నిబంధనలను పదేపదే ఉల్లంఘించే దుకాణాలను శాశ్వతంగా మూసివేసే అవకాశం కూడా ఉంది.

పార్లమెంట్ పబ్లిక్ యుటిలిటీస్ అండ్ ఎన్విరాన్‌మెంట్ కమిటీ చైర్మన్ ఎంపీ మహమ్మద్ మౌసా మాట్లాడుతూ.. ఈ బిల్లును తదుపరి పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా తక్కువ ధరలకు వేప్ పాడ్‌లను రీఫిల్ చేసి విక్రయించడం వల్ల యువతకు వేపింగ్ సులభంగా అందుబాటులోకి వస్తోందని తెలిపారు.

బహ్రెయిన్‌లో ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వారికి పొగాకు ఉత్పత్తులను విక్రయించడం లేదా అందించడం నిషేధం. 2025లో చేసిన సవరణల ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారికి కనీసం BD100 జరిమానా విధించవచ్చు. కోర్టు తీర్పు అనంతరం దుకాణాన్ని మూడు నెలల వరకు మూసివేయడం లేదా ఉల్లంఘనకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కొత్త బిల్లు అమల్లోకి వస్తే జరిమానాను ఏకంగా BD1,000కు పెంచనున్నారు. అదే తప్పును పదేపదే చేసే దుకాణాలపై శాశ్వత మూసివేత చర్యలు తీసుకోనున్నారు.

18 ఏళ్లలోపు వారికి పొగాకు, వేప్ ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్న అనేక దుకాణాలను ఇప్పటికే గుర్తించి సంబంధిత అధికారులకు అప్పగించినట్లు మౌసా తెలిపారు. ప్రస్తుత చట్టాల ప్రకారం ఆయా దుకాణాలపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పిల్లలకు ఈ ఉత్పత్తులు సులభంగా అందుబాటులోకి రావడం ఆందోళనకరంగా మారిందని, దీనిని అరికట్టేందుకు తల్లిదండ్రులు, పాఠశాలలు, విద్యాశాఖ, ప్రభుత్వ సంస్థలు, సామాజిక సంఘాలు సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

కొత్త బిల్లులో వేప్, ఎలక్ట్రానిక్ షిషా దుకాణాలపై అదనపు తనిఖీలకు కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. రిటైలర్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు విక్రయాల రికార్డులను నిర్వహించాలి. అనుమానాస్పదంగా మైనర్లకు విక్రయాలు జరిగినట్లు తేలితే తనిఖీల కోసం సీసీటీవీ ఫుటేజీ, విక్రయాల రికార్డులను అధికారులు పరిశీలించే అవకాశం ఉంటుంది. పిల్లలకు పొగాకు, వేప్ ఉత్పత్తుల వల్ల కలిగే హానిని దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వం కలిసి పూర్తి స్థాయి బిల్లును రూపొందిస్తున్నట్లు మౌసా తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com