ఔక్ఫ్‌ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!

- August 26, 2026 , by Maagulf
ఔక్ఫ్‌ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!

మనామా: స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన నిధుల దుర్వినియోగం, నకిలీ పత్రాల సృష్టి, నేరం ద్వారా వచ్చిన సొమ్మును చట్టబద్ధంగా చూపించే ప్రయత్నం చేసిన కేసులో జాఫర్ ఔక్ఫ్ డైరెక్టరేట్‌కు చెందిన 45 ఏళ్ల విభాగాధిపతికి హై క్రిమినల్ కోర్టు 22 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నిందితుడు చారిటబుల్ ఎండోమెంట్స్ అండ్ వెల్ఫేర్ కమిటీ సమన్వయకర్తగా పనిచేస్తూ, పేదలు, అవసరంలో ఉన్న వారికి అందించాల్సిన సహాయ నిధుల చెక్కులను తన వ్యక్తిగత అవసరాలకు మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది.

లబ్ధిదారుల పేర్లను ఉపయోగించడం లేదా నకిలీ పేర్లతో చెక్కులు పొందడం ద్వారా నిధులను స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ డబ్బును వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు కొనుగోలు చేయడంతో పాటు రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిల చెల్లింపులకు వినియోగించినట్లు కోర్టుకు సమర్పించిన ఆధారాలు వెల్లడించాయి. అంతేకాకుండా, పలువురు మహిళలు.. ముఖ్యంగా వితంతువులు, విడాకులు పొందిన మహిళల బ్యాంకు ఖాతాలను వారి అనుమతి లేకుండా నిధుల బదిలీకి ఉపయోగించినట్లు దర్యాప్తులో బయటపడింది.

నిందితుడికి BD160,000 వడ్డీలేని రుణం మంజూరైనట్లు చూపించే నకిలీ లేఖను కూడా ఆధారంగా కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే ఆ లేఖ, దానిపై ఉన్న సంతకం అసలైనవి కావని జాఫర్ ఔక్ఫ్ కౌన్సిల్ చైర్మన్ ధృవీకరించారు. కోర్టు నిందితుడు BD483,107.710 మొత్తాన్ని తిరిగి చెల్లించాలని, BD100,000 జరిమానా విధించింది. మనీలాండరింగ్ నేరంతో సంబంధం ఉన్న BD414,878.740 మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు, నకిలీ పత్రాలు మరియు నేరం ద్వారా సంపాదించిన ఆస్తులకు సమానమైన ఆస్తులను కూడా జప్తు చేయాలని ఆదేశించింది.

పలు చెక్కులు బ్యాంకులు, కంపెనీలకు జారీ కావడంపై అధికారులకు అనుమానాలు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అనంతరం నిర్వహించిన ఆడిట్, దర్యాప్తులో భారీగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com