హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..

- August 26, 2026 , by Maagulf
హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఉద్యోగాలు, ఉపాధి కోసం ప్రతిరోజూ దూర ప్రాంతాలకు ప్రయాణించే నగరవాసులకు రాత్రివేళల్లో రవాణా కొరత ఇబ్బందిగా మారుతోంది. ప్రస్తుతం రాత్రి 10 గంటల తర్వాత బస్సు సర్వీసులు తగ్గిపోవడం, 11 గంటల తర్వాత మెట్రో సేవలు కూడా నిలిచిపోవడంతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆటోలలో వెళ్లాలంటే అధిక మొత్తంలో వసూలు చేస్తుండటం, సొంత వాహనాల్లో అంత దూరం ప్రయాణించలేకపోవడంతో ముఖ్యంగా మహిళా ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ ఇబ్బందుల్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఇకపై హైదరాబాద్‌లో రాత్రి సమయాల్లోనూ బస్సులు నడపాలని నిర్ణయించింది.

హైదరాబాద్‌లో రాత్రి 10 గంటల 30 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు స్పెషల్ బస్సులను నడపాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇకపై ప్రతిరోజూ నిరంతరాయంగా ఈ బస్సులు నడుస్తాయి. నైట్ షిఫ్ట్ ఉద్యోగులు, ఐటీ-బీపీఓ సిబ్బంది, దూర ప్రాంతాల నుంచి రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి ఈ సేవలు ఎంతో ఉపయోగకరం కానున్నాయి. తొలి దశలో 30 బస్సులను ఏర్పాటు చేసి 6 ప్రధాన మార్గాల్లో సేవలు ప్రారంభించారు.

ప్రారంభించిన 6 ప్రధాన మార్గాలు – బస్సు నంబర్ల వివరాలు
రాత్రి వేళల్లో ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులోకి తెచ్చిన బస్సు మార్గాలు మరియు వాటి నంబర్ల వివరాలు:

మేడ్చల్ నుండి గచ్చిబౌలి: బస్సు నంబర్ 195
కొండాపూర్ నుండి సికింద్రాబాద్: బస్సు నంబర్ 10H
కోఠి నుండి పటాన్‌చెరు: బస్సు నంబర్ 218
కోఠి నుండి పటాన్‌చెరు (మరో రూట్): బస్సు నంబర్ 222A
హయత్‌నగర్ నుండి జేబీఎస్ (JBS): బస్సు నంబర్ 290U
సికింద్రాబాద్ నుండి పటాన్‌చెరు: బస్సు నంబర్ 219
ఈ ప్రత్యేక సేవల ద్వారా హైదరాబాద్ వాసులకు ప్రైవేట్ క్యాబ్‌లు, ఆటోలపై ఆధారపడే అవసరం తగ్గడంతో పాటు ఆర్థిక భారం తప్పనుంది. అత్యవసర రాత్రి ప్రయాణాలకు ప్రజా రవాణా మరింత సురక్షితంగా, అందుబాటులోకి వచ్చినట్లయింది. ప్రయాణికుల స్పందన, ఆక్యుపెన్సీ ఆధారంగా రానున్న రోజుల్లో మరిన్ని మార్గాలకు ఈ నైట్ బస్సులను విస్తరించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com