మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!

- August 29, 2026 , by Maagulf
మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!

ఖసబ్: ఒమన్‌లోని మసందమ్ గవర్నరేట్ చమురేతర ఆర్థిక కార్యకలాపాలను విస్తరించేందుకు పర్యాటకం, సముద్ర ఆర్థిక వ్యవస్థ, మత్స్య పరిశ్రమలు, లాజిస్టిక్స్ రంగాలపై దృష్టి సారిస్తోంది. వ్యూహాత్మక భౌగోళిక స్థానం, సముద్ర వనరులు, సహజ ప్రకృతి అందాలను సద్వినియోగం చేసుకుని నాణ్యమైన పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఒమన్ విజన్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా సుస్థిర పర్యాటకం, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ, విలువ ఆధారిత పరిశ్రమలు, లాజిస్టిక్స్‌ను ప్రధాన ప్రాధాన్య రంగాలుగా గుర్తించారు. మసందమ్ గవర్నరేట్ వాణిజ్యం, పరిశ్రమ, పెట్టుబడి ప్రోత్సాహక శాఖ డైరెక్టర్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ ఖుతైతి మాట్లాడుతూ.. చమురేతర కార్యకలాపాల విస్తరణకు మసందమ్‌లో గణనీయమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

పర్యాటకం, సముద్ర రంగాల్లో అవకాశాలు

పర్యావరణ రిసార్టులు, సముద్ర, అడ్వెంచర్ టూరిజం, వైద్య, వెల్‌నెస్ టూరిజం వంటి రంగాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అలాగే మత్స్య పరిశ్రమలు, మెరైన్ సేవలు, పడవలు, యాచ్‌ల నిర్వహణ, పోర్టులకు సంబంధించిన లాజిస్టిక్స్ రంగాలను అభివృద్ధి చేయనున్నారు. తేలికపాటి, ప్రాసెసింగ్ పరిశ్రమలు, మత్స్య ఉత్పత్తుల తయారీ, రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ ప్రాజెక్టులకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

మసందమ్‌లో చేపల పెంపకం, చేపల ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, వ్యవసాయం, నిర్మాణ కాంట్రాక్టింగ్ వంటి చమురేతర కార్యకలాపాలు ఇప్పటికే స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా ఉన్నాయి. వ్యవసాయం, అటవీ, మత్స్య రంగం సుమారు 7.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం నిర్మాణం, చేపల వేట, వ్యవసాయం, షిప్పింగ్ ఏజెన్సీలు, హోటళ్లు, రిసార్టులు తదితర కార్యకలాపాలకు సంబంధించి సుమారు 3,000 యాక్టివ్ లైసెన్సులు ఉన్నాయి.

ఖసబ్ పోర్టు అభివృద్ధి, ఖసబ్-లిమా-దిబ్బా రహదారి, మహాస్ ఇండస్ట్రియల్ సిటీ అభివృద్ధి, కొత్త పర్యాటక ప్రాజెక్టులు మసందమ్‌లో పెట్టుబడులకు మరింత ఊతమివ్వనున్నాయి. ఇవి రవాణా అనుసంధానాన్ని మెరుగుపరచడంతో పాటు వాణిజ్య, పర్యాటక కార్యకలాపాలను పెంచుతాయని అధికారులు తెలిపారు.

ఎస్‌ఎంఈలకు ప్రోత్సాహం

రాబోయే దశలో సుస్థిర పర్యాటకం, సముద్ర ఆర్థిక వ్యవస్థ, విలువ ఆధారిత పరిశ్రమలు, లాజిస్టిక్స్, సరఫరా గొలుసులపై మసందమ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. చిన్న, మధ్య తరహా సంస్థలను ప్రోత్సహిస్తూ నాణ్యమైన పెట్టుబడులను ఆకర్షించనున్నారు. పర్వతాలు, బేలు, సముద్ర తీరాలు, సమృద్ధిగా ఉన్న సముద్ర వనరులు మసందమ్‌ను పర్యాటక, సముద్ర పరిశ్రమలకు అనువైన ప్రాంతంగా మారుస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. వీటి ఆధారంగా కొత్త ఉపాధి అవకాశాలు, స్థానిక సరఫరా గొలుసులు, ఆర్థిక విలువను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మసందమ్‌ను ఒమన్‌లో మరింత కీలకమైన పెట్టుబడి, పర్యాటక, ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు దేశ ఆర్థిక వైవిధ్యీకరణలో చమురేతర రంగాల వాటాను పెంచాలని గవర్నరేట్ భావిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com