ఫేస్ బుక్ కోర్టెక్కనుంది...

- September 28, 2016 , by Maagulf
ఫేస్ బుక్ కోర్టెక్కనుంది...

జర్మన్ యూజర్ల వాట్సాప్ డేటాను ఫేస్ బుక్ సేకరించడానికి, స్టోర్ చేయడానికి వీలులేదని ఆ దేశ ప్రైవసీ రెగ్యులేటరీ చేసిన ఆదేశాలపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కోర్టెక్కనుంది. జర్మన్ రెగ్యులేటరీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ, దీనిపై అప్పీల్ కు వెళ్లనున్నట్టు ఫేస్ బుక్ ప్రకటించింది. దీంతో ప్రైవసీ రెగ్యులేటర్లకు, ఫేస్ బుక్ కు మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఫేస్ బుక్ జర్మన్ వాట్సాప్ యూజర్ల డేటాను సేకరించడం వెంటనే ఆపేయాలని, ఇప్పటికే సేకరించిన సమాచారాన్ని తొలగించాలని జర్మన్ ప్రైవసీ రెగ్యులేటరీ ఆదేశాలు జారీచేసింది.ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల డేటాను ఫేస్ బుక్ ను షేర్ చేసుకుంటోంది. ఈ విషయంపై వాట్సాప్ కొత్త పాలసీ విధానాలను కూడా ప్రవేశపెట్టింది.ఒకవేళ తమ డేటా ఫేస్ బుక్ కు షేర్ చేయడం ఇష్టలేని వారు, వాట్సాప్ వాడకాన్ని నిలిపివేసుకోవచ్చంటూ అవకాశం కూడా కల్పించింది.
డేటా సంరక్షణ చట్టాన్ని ఫేస్ బుక్ అతిక్రమిస్తుందని డేటా ప్రొటెక్షన్, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ ఫర్మేషన్ హాంబర్గ్ కమిషనర్ మండిపడ్డారు. 35 మిలియన్ వాట్సాప్ యూజర్లున్న జర్మనీలో ఫేస్ బుక్ దీనికోసం సరియైన అనుమతులు పొందలేదని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం ఫేస్ బుక్, వాట్సాప్ ను సొంతంచేసుకున్నప్పుడు, రెండు కంపెనీల మధ్య ఎలాంటి డేటా మార్పిడి జరగదని వాగ్దానం చేసినట్టు కమిషన్ జోహాన్నెస్ కాస్పర్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ నెట్ వర్క్ ఫేస్ బుక్, వాట్సాప్ ను 19 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.1,26,322 కోట్లకు) కొనుగోలు చేసింది.ప్రస్తుతం ఈ రెండు సంస్థలు చేస్తున్న పని, ఇటు ప్రజలను అటు యూజర్లను తప్పుదోవ పట్టించడమే కాకుండా, డేటా సంరక్షణ చట్టాలకు తూట్లు పొడుస్తున్నట్టు విమర్శించారు. కాగ జర్మన్ రెగ్యులేటరీ చేసిన ఆదేశాలపై తాము అప్పీలుకు వెళ్తామని, హాంబర్గ్ డీపీఏతో తాము కలిసి పనిచేస్తామని, ఆయన సందేహాలను నివృతి చేస్తామని ఫేస్ బుక్ ప్రకటించింది. జర్మనీలో ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయం హాంబర్గ్ లో ఉంది. ఈ ప్రాంతమంతా కాస్పర్ పరిధిలో నడుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com