పారిశ్రామిక రంగంలో తెలంగాణ దేశంలోనే ప్రథమస్థానం...

- November 01, 2016 , by Maagulf
పారిశ్రామిక రంగంలో తెలంగాణ దేశంలోనే ప్రథమస్థానం...

పారిశ్రామిక రంగంలో తెలంగాణరాష్ట్రం దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వాణిజ్య అనుకూల రాష్ట్రాల్లో గతేడాది 13వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఈసారి తొలిస్థానంలో నిలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనా తీరు, ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల కారణంగానే ఈ ఫలితం దక్కిందన్నారు. ప్రభుత్వంలోని 22 శాఖలు సమన్వయంతో పనిచేయడంతోనే ఈ ఘనత దక్కించుకున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్థి పథంలో దూసుకెళ్లొందని కేటీఆర్‌ తెలిపారు. ఏకగవాక్ష విధానంలో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడం దేశంలో ఎక్కడా లేదన్నారు.

పారిశ్రామికీకరణను సరళతరం చేసేందుకు 26 చట్టాలను సవరించామన్నారు. గడిచిన ఏడాదిన్నరలో 2550 పరిశ్రమకు అనుమతులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. వీటిద్వారా లక్షా 61వేల మందికి ప్రత్యక్షంగా, 3-4లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించిందన్నారు. రాష్ట్రంలో మరిన్ని ఉపాధి అవకాశాల కల్పన కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సంస్కరణల ద్వారా తీసుకొచ్చిన మార్పు ఉపాధి కల్పన దిశగా ఉండాలన్నారు.సర్వేలపై ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కేటీఆర్‌ ఆక్షేపించారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంగా కేసీఆర్‌ నిలవడాన్ని వారు ఓర్వలేకపోతున్నారన్నారు. ప్రభుత్వం బూటకపు సర్వేలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నామని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వాణిజ్య అనుకూల రాష్ట్రాల జాబితాలో తెలంగాణ తొలిస్థానం సాధించిందని.. దీనికి ప్రతిపక్షాలు ఏం సమాధానం చెబుతాయని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com