బంగ్లాదేశ్‌లో అల్ప సంఖ్యాకులైన హిందువులకు రక్షణ లేకుండా పోతోంది

- November 05, 2016 , by Maagulf
బంగ్లాదేశ్‌లో అల్ప సంఖ్యాకులైన హిందువులకు రక్షణ లేకుండా పోతోంది

బంగ్లాదేశ్‌లో అల్ప సంఖ్యాకులైన హిందువులకు రక్షణ లేకుండా పోతోంది. నాలుగు రోజుల క్రితమే అనేక ఇళ్ళు, దేవాలయాలను ధ్వంసం చేశారు. శుక్రవారం బ్రహ్మంబరియా జిల్లాలో మళ్ళీ ఘరానా మూకలు విరుచుకుపడ్డాయి. మైనారిటీలైన హిందువులపై దాడులు చేశాయి. మధ్యపఢ, దక్షిణ్ పఢ గ్రామాల్లో హిందువుల ఇళ్ళను తీవ్రవాదులు తగులబెట్టారని అదనపు పోలీసు సూపరింటెండెంట్ మహ్మద్ ఇక్బాల్ హుస్సేన్ తెలిపారు. అయితే ఈ దాడుల్లో ఎవరూ గాయపడలేదని చెప్పారు. దీంతో ఇప్పటికే కల్లోలంగా ఉన్న ఉపజిల ప్రాంతంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. గత నెల 30న దాదాపు 3 వేల మంది ముస్లింలు మూకుమ్మడిగా వెళ్ళి 10 దేవాలయాలను, వందలాది ఇళ్ళను ధ్వంసం చేశారు.ఈ విధ్వంసకాండలో సుమారు 100 మంది హిందువులు తీవ్రంగా గాయపడ్డారు. మత్స్యకారుడైన రసరాజ్ దాస్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో ముస్లింల మనోభావాలు దెబ్బతినే అంశాలు ఉన్నాయని ఈ దుండగులు ఆరోపించారు. అయితే తన ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయిందని రసరాజ్ తెలిపారు, అంతే కాకుండా బేషరతుగా క్షమాపణ కూడా చెప్పారు. అయినప్పటికీ అతనిని దుండగులు పట్టుకొని, తీవ్రంగా కొట్టి, పోలీసులకు అప్పగించారు.ఆయన అధికారంలో ఉన్న అవామీ లీగ్ పార్టీ మద్దతుదారు. విధ్వంసకాండ జరిగిన గ్రామానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రతినిధులు వెళ్ళారు. మైనారిటీలైన హిందువుల నుంచి భూములను లాక్కొనే ఉద్దేశంతోనే పథకం ప్రకారం ఈ విధ్వంసం సృష్టించారని ఆ ప్రతినిధులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com