రామ్గోపాల్ వర్మ 340 కోట్లు బడ్జెట్ తో న్యూక్లియర్ సినిమా...
- November 07, 2016
సంచలనాలకు, వివాదాలకు మారుపేరు ఏ డైరెక్టర్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రామ్గోపాల్ వర్మ. తాను ఏ సినిమా తీసినా.. ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేసో లేదంటే సినిమానే ఓ వివాదం చేసో ప్రచారం కల్పించుకుంటాడు. ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశాడు ఈ హిచ్కాక్ డైరెక్టర్. ఓ అంతర్జాతీయ సినిమానే తీయబోతున్నాడు. దాని బడ్జెట్, ఎంచుకున్న కథాంశం తెలిస్తే ఒకింత షాక్ అవ్వాల్సిందే. 340 కోట్ల భారీ బడ్జెట్తో సినిమా తీస్తున్నట్టు ప్రకటించాడు వర్మ. మరి అంత భారీ బడ్జెట్ అయితే.. ఆ బడ్జెట్కు తగ్గట్టు కథ కూడా బలంగానే ఉండాలి కదా! అందుకే ఈ సారి 'మూడో ప్రపంచ యుద్ధం' నేపథ్యంలో 'న్యూక్లియర్' అనే కథ అల్లేశాడు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు 'అణు బాంబు'లను కలిగి ఉన్నాయి.
లేని దేశాలు వాటి వైపు చూస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధాన్నే తీసుకుంటే జపాన్పై అమెరికా వేసిన రెండు అణుబాంబులు ఎంతటి విధ్వంసాన్ని సృష్టించాయో, ఎంత కాలం ఆ ఎఫెక్ట్ ఉందో తెలిసిందే. మరిప్పుడు అవే అణ్వాయుధాలు, అణుబాంబులు అవాంఛిత వ్యక్తుల చేతుల్లో పడితే పరిస్థితి ఏంటి..? అన్న దానిపైన కథను అల్లి తీసేందుకు సిద్ధమైపోయాడు రామ్గోపాల్ వర్మ.
దానికి సంబంధించిన విషయాలను అతడు ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. ''తొలిసారిగా అంతర్జాతీయ సినిమా తీయబోతున్నాను. దాని బడ్జెట్ 340 కోట్లు. ఆ సినిమా పేరు న్యూక్లియర్.
నేను ఇప్పటిదాకా ఫిక్షన్, నాన్ ఫిక్షన్ కథలు, నవలలెన్నో చదివాను. కానీ, ఇప్పటిదాకా న్యూక్లియర్ వంటి కాన్సెప్ట్తో రాలేదు. భారత్లో ఇప్పటిదాకా ఏ సినిమాకు పెట్టనంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. సినిమా కథ డిమాండ్కు అనుగుణంగానే ఆ బడ్జెట్ను నిర్ణయించాం.
70 ఏళ్ల క్రితం జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై వేసిన అణుబాంబుల మోత ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. మరి అలాంటి విధ్వంసం ఇప్పుడు జరిగితే.. అదీ ముంబై లాంటి పెద్ద నగరాలపై అణు బాంబును వేస్తే... అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది.
అంతటితో ప్రపంచం అంతం'' అని ట్వీట్ చేశాడు. కాగా, భారత్, అమెరికా, చైనా, రష్యా వంటి దేశాల్లో, ఆయా దేశాలకు చెందిన నటీనటులతో సినిమాను తీస్తామని, సర్కార్-3 షూటింగ్ అయిపోగానే వెంటనే సినిమాను పట్టాలెక్కిస్తామని వెల్లడించాడు. సీఎంఏ గ్లోబల్ అనే నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో న్యూక్లియర్ తెరకెక్కనుంది. ఈ అణుబాంబుల వల్ల కలిగే అనర్థాలను ప్రపంచ దేశాలకు కళ్లకు కట్టబోతున్నాడన్నమాట.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







