సత్యసాయిబాబా 91వ జయంతి...
- November 22, 2016
సమత, మమత కలగలసిన రూపం అది. మానవత్వం మూర్తీభవించిన దేహం అది. సేవే లక్ష్యం, ప్రేమే మార్గంగా నడిచిన సన్మార్గం, గుక్కెడు నీటి కోసం అంగలారుస్తున్న జనం గొంతు తడిపిన దివ్య హస్తం అన్నీ ఆయనే. అందుకే శివైక్యం చెందిన తర్వాత కూడా ప్రతి మదిలో జీవిస్తున్న దివ్య జ్యోతిలా ప్రకాశిస్తున్నారు. అజ్ఞానపు తిమిరాలను అఖండ దీపమై పారద్రోలుతున్నారు.అది 1950ల కాలం. అనంతపురంలో కరువు విలయతాండవం చేస్తుండేది.విద్య,వైద్యం వంటి కనీస సౌకర్యాలు లేక జనం విలవిలలాడిపోయేది. ఆ దీనస్ధితిని చూసి ఓ మహిమాన్విత రూపం తల్లడిల్లిపోయింది. తీవ్ర దుర్భిక్షం నెలకొన్న ఈ ప్రాంతానికి వైద్యం చేయాలని తలంచిన మనిషి రూపంలోని దైవం సత్యసాయి. 1956 అక్టోబర్ 4న పుట్టపర్తిలో జనరల్ ఆస్పత్రిని ప్రారంభించారు. అలా మొదలైన సత్యసాయి సూపర్ స్పెషాలిటీ, సిమ్స్ ఆస్పత్రి ఇప్పటి వరకు 4 మిలియన్ రోగులకు ఆరోగ్యం ప్రసాదించింది. అనంతపురాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్కు చరమగీతం పాడాలనేది శ్రీ సత్యసాయిబాబా సంకల్పం. ఇందుకోసం 500 కోట్ల వ్యయంతో సత్యసాయి త్రాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ పధకం ద్వారా జిల్లాలో 1447 గ్రామాలకు తాగు నీరందుతోంది. ఇదే పధకం క్రింద 3200 కిలోమీటర్ల మేర పైప్లైన్, 18బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, 136గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్లు,2350 ఓవర్హెడ్ ట్యాంకులను నిర్మించారు. సత్యసాయి త్రాగునీటి పధకం కింద పాలమూరు జిల్లాలోని 141గ్రామాలకు, మెదక్లో 179 గ్రామాలకు, ఉభయ గోదావరి జిల్లాల్లో 500 గ్రామాలకు నీరందుతోంది. అంతేకాదు చెన్నై దాహార్తిని తీరుస్తున్న తెలుగుగంగ,కండలేరు కాలువల నిర్మాణానికి సత్యసాయి 250 కోట్ల సహాయం అందించారు. విద్య అంతిమలక్ష్యం ధనార్జన కాకూడదు.. మానసిక పరివర్తనతో మనిషికి పరిపూర్ణత్వాన్ని ప్రసాదించాలనేది సత్యసాయి లక్ష్యం. ఈ లక్ష్యంతోనే 1981లో సత్యసాయి ఇన్సిస్ట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ను ఏర్పాటు చేసారు. అండర్ గ్రాడ్యుయేట్లో ఏడు విభాగాలు,పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 5విభాగాలు, 3ప్రొఫెషనల్ కోర్సులను యూనివర్సిటీ ద్వారా అందిస్తున్నారు.ఈ యూనివర్సిటీకి 1986లో ఇండియన్ యూనివర్సిటీ అసోషియేషన్లో శాశ్వత సభ్యత్వం లభించగా 2008లో సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీగా అవతరించింది. ఇలా చెప్పుకుంటూ పోతే సత్యసాయి మహిమలు, సేవలు ఎన్నో ఎన్నెన్నో.. అందుకే సత్య సాయిని దేవుడని కొందరంటారు. దేవుడు కాదని వాదించే వారు కూడా మనసున్న మనిషి అని ఒప్పుకుంటారు. ఏది ఏమైతేనేం.. ఎవరి నమ్మకం ఏదయితేనేం.. పరమపదించినా కోట్లాది గుండెల్లో సజీవంగా కొలువై ఉన్న మహా మనిషి సత్యసాయి అనేది అక్షర సత్యం.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









