శంషాబాద్ విమానాశ్రయంలో మహిళా ఉగ్రవాది అరెస్టు

- September 11, 2015 , by Maagulf
శంషాబాద్ విమానాశ్రయంలో మహిళా ఉగ్రవాది అరెస్టు

శంషాబాద్ విమానాశ్రయంలో ఓ మహిళా ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నిక్కీ జోసెఫ్ అనే ఉగ్రవాదిని పక్కా సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నారు. గత జనవరిలో పోలీసులు అరెస్టు చేసిన మొయినుద్దీన్ అనే ఉగ్రవాదికి ఈమె ప్రియురాలని, ఈమె ఇంగ్లండ్ దేశస్థురాలని తెలుస్తోంది. ఈమెకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)తో సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. హైదరాబాద్ కు చెందిన పలువురిని ఐఎస్ఐఎస్ లో చేర్చేందుకు ఈమె ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మొయినుద్దీన్ తో కలిసి ఓ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి.. దాని సాయంతో పలువురిని ఆకర్షించేందుకు ప్రయత్నించింది. ఈమెకు 2011లోనే మొయినుద్దీన్ తో పరిచయం అయ్యింది. ఇక్కడ కొన్నాళ్ల పాటు తమ కార్యకలాపాలు సాగించిన తర్వాత.. దుబాయ్ వెళ్లిపోయింది. ఆమెను పోలీసులు అత్యంత చాకచక్యంగా హైదరాబాద్ కు రప్పించారు. ఇప్పుడు అరెస్టు చేసిన తర్వాత.. ఆమెకు హైదరాబాద్ లో ఎంతమందితో పరిచయాలు ఉన్నాయి, ఎవరెవరికి ఆమె ఎర వేసిందనే వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐఎస్ఐఎస్ లో చేరేందుకు వెళ్తూ ఇప్పటివరకు 30 మందికి పైగా వ్యక్తులు శంషాబాద్ లో అరెస్టయ్యారు. కోల్ కతా నుంచి కూడా కొంతమంది గతంలో వెళ్లేందుకు ప్రయత్నించారు. తాజా అరెస్టుతో కొంతవరకు దీనికి అడ్డుకట్ట పడినా.. ఇంకా ఏయే మార్గాల ద్వారా వెళ్తున్నదీ తెలుసుకోవాల్సి ఉంది. దానికి ఈమె అందించే సమాచారం కీలకం అవుతుందని పోలీసులు భావిస్తున్నారు.

 

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com