'ఖైదీ నంబర్ 150' సినిమా రివ్యూ
- January 11, 2017
చిత్రం పేరు : ఖైదీ నంబర్ 150
నటీనటులు: చిరంజీవి, కాజల్ అగర్వాల్, తరుణ్ అరోరా, రాయ్ లక్ష్మి, బ్రహ్మానందం, అలీ, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్ రెడ్డి తదితరులు.
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
కాస్ట్యూమ్స్: కొణిదెల సుస్మిత
ఛాయాగ్రహణం: ఆర్.రత్నవేలు
మాటలు: పరుచూరి బ్రదర్స్, బుర్రా సాయి మాధవ్, వేమారెడ్డి
నిర్మాత: రామ్చరణ్
సమర్పణ: కొణిదెల సురేఖ
కథ: మురుగదాస్
దర్శకత్వం: వి.వి.వినాయక్
విడుదల తేదీ: 11.1.2017
డేరింగ్, డాషింగ్, డైనమిక్ హీరోగా తెలుగు ప్రేక్షకుల్ని తన సినిమాలతో ఉర్రూతలూగించి, కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకున్న చిరంజీవి సినిమా ఇది. తొమ్మిది సంవత్సరాల తరవాత ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ మళ్లీ వెండితెరపై ప్రత్యక్షం అవుతున్న మెగాస్టార్ మూవీ ఇది. రామ్చరణ్ నిర్మాతగా అందిస్తోన్న తొలి సినిమా ఇది. అన్నింటికంటే మించి ఇది ‘అన్నయ్య’ 150వ సినిమా... సంక్రాంతి బరిలో ముందొచ్చిన చిత్రం. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ సినిమా... తమిళ చిత్రం ‘కత్తి’కి రీమేక్గా మన ముందుకొచ్చింది. మరి ఈ మెగా మూవీ కథ, మాటలు, పాటలు, పోరాటాలు, పంచ్డైలాగ్ల విషయంలో ఎన్నిమార్కులు సంపాదించుకుంటుందీ... సినిమా అభిమానుల్ని ఎలా అలరిస్తుందీ... ‘చిరు’ సెకండ్ ఇన్నింగ్స్లో ఏ స్థాయిలో సూపర్ అనిపించారు వంటి విశేషాలు తెలియాలంటే.. ఈ సమీక్ష చదవాల్సిందే!!
కథేంటంటే: కోల్ కతా సెంట్రల్ జైల్లో కత్తి శీను కనిపించటంతో కథ మొదలవుతుంది. జైలు నుంచి తప్పించుకున్నశీను హైదరాబాద్ కు వస్తాడు. అక్కడి నుంచి బ్యాంకాక్ కు వెళ్లే సమయంలో లక్ష్మి (కాజల్)ని చూసి ప్రేమలో పడతాడు. ఫారిన్ వెళ్లాలనుకున్నప్పటికీ లక్ష్మి కోసం ఆగిపోతాడు. ఆ సమయంలోనే ఒకరిపై హత్యాయత్నం జరగటం.. అతను తనలానే ఉండటంతో ఆశ్చర్యానికి గురి అవుతాడు. తనలా ఉన్న శంకర్ (చిరంజీవి ద్విపాత్రాభినయం)ను కాపాడి ఆసుపత్రిలో చేరుస్తాడు. శంకర్ ఎవరంటే.. రైతుల పక్షాన నిలిచి వారి కోసం పోరాడే రైతు నాయకుడు.
మళ్లీ ఫారిన్ వెళ్లటానికి ప్రయత్నాలు చేసుకుంటున్న వేళ.. కత్తి శీనును శంకర్ గా భావించిన కలెక్టర్ అతన్ని రైతులున్న వృద్ధాశ్రమానికి తీసుకొస్తాడు. కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్(తరుణ్ అరోరా) రైతుల భూముల్ని కాజేసి.. అక్కడో శీతల పానీయాల కంపెనీని పెట్టాలనుకుంటాడు. కత్తి శీనును చూసిన అగర్వాల్ అతన్ని రైతు నాయకుడు శంకర్ గా అనుకొని.. రైతుల భూముల్ని తనకిచ్చేలా చేస్తే రూ.25కోట్లు ఇస్తామని బేరం పెడతాడు. దీనికి సరేనంటాడు శంకర్ రూపంలో ఉన్న కత్తి శీను.
శంకర్కు సన్మాన కార్యక్రమంతో.. అతడి పూర్వాపరాలు కత్తి శీనుకు తెలుస్తాయి. రైతుల క్షేమం కోసం శంకర్ ఎంతగా తపిస్తాడన్నది తెలీటంతో పాటు.. అగర్వాల్ కుతంత్రం ఏమిటో అర్థమవుతుంది. రైతుల పక్షాన నిలిచి.. శంకర్ ఆశయాల్ని అమలు చేయాలని కత్తిశీను అనుకుంటాడు. రైతుల భూముల్ని కాజేయాలనుకున్న అగర్వాల్ కుట్రకు చెక్ చెబుతూ.. రైతుల పక్షాన నిలిచే ప్రయత్నం చేస్తాడు. దీంతో కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్ కు.. రైతు నాయకుడు శంకర్ గా మారిన కత్తి శీనుకు మధ్య పోరు మొదలవుతుంది. అగర్వాల్ కుట్రను ఏ విధంగా అడ్డుకున్నాడు? రైతుల పంట భూములు కోల్పోకుండా చేశాడా? అగర్వాల్ కు చెక్ పెట్టేందుకు కత్తి శీను వేసిన వ్యూహం ఫలించిందా? శంకర్ ఏమయ్యాడు? లక్ష్మీ.. కత్తి శ్రీనుల ప్రేమకథ ఏమైంది? కత్తి శీను ఫారిన్ ప్రయాణం ఏమైంది? అన్నవి తెలుసుకోవాలంటే వెండితెర మీద సినిమాను చూడాల్సిందే.
ఎలా ఉందంటే: వినోదం, సందేశం మేళవింపుగా సినిమా రూపుదిద్దుకుంది. కత్తి శీను పాత్ర ఎలా మలుపులు తిరుగుతుందీ.. అతడికీ, విలన్కీ మధ్య ఎలా యుద్ధం జరుగుతుంది. వంటి వాటిని దర్శకుడు ఆసక్తికరంగా మలిచారు. ఒక పక్క కథనం వేగంగా సాగుతుండగానే అలరించే పాటలూ, రైతుల పరిస్థితిని కళ్లకు కట్టే సన్నివేశాలూ, కామెడీ పంచ్లూ వరుస కడతాయి. ఇది ‘కత్తి’కి రీమేక్. అయితే చిరంజీవి రేంజ్కి తగ్గట్టుగా పాటల్నీ, ఫైట్స్నీ బాగా చిత్రీకరించారు. ‘అమ్మడూ.. లెట్స్డూ కుమ్ముడూ’ పాటలో రామ్చరణ్ తళుక్కుమని మెరుస్తాడు. ‘రత్తాలూ..’ ‘సన్నజాజిలా పుట్టేసిందిరో, మల్లెతీగలా చుట్టేసిందిరో’ పాటలు హుషారెక్కిస్తాయి. ‘అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ’ కుర్రకారుతో ఈలలేయిస్తుంది.
ఎవరెలా చేశారంటే: తొమ్మిదేళ్ల తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవి మునుపటిలాగానే తన నటనతో రెండు పాత్రల్ని పండించారు. డాన్సుల్లోనూ ఒకప్పటి హుషారు కనిపిస్తుంది. చిరంజీవి సరసన కాజల్ అందంగా కనిపించింది. దర్శకుడిగా వి.వి. వినాయక్ చిరంజీవి ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని కథనాన్ని నడిపించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు ఫొటోగ్రఫీ బాగున్నాయి. బ్రహ్మానందం, పోసాని, జయప్రకాశ్రెడ్డి వాళ్ల పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
బలాలు
+ చిరంజీవి
+ కథ.. కథనం
+ పాటలు.. డ్యాన్సులు
+ ఉద్వేగభరిత సన్నివేశాలు
బలహీనతలు
- బలమైన విలన్ పాత్ర లేకపోవటం
చివరగా.. ‘ఖైదీ నంబరు 150’.. అభిమానులకు పండుగే.
ఈ చిత్రానికి మాగల్ఫ్.కాం వారి రేటింగ్: 3.5/5
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది అతని వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
తాజా వార్తలు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







