కొత్తగా 50 చోట్ల వైఫై!
- January 26, 2017
3జీ ట్రాఫిక్ను సర్వే చేసిన బీఎస్ఎన్ఎల్
4జీ సవాళ్లను అధిగమించేందుకు 4.5జీతో ముందుకు
మార్చి నెలాఖరు నాటికి నగరంలో అందుబాటులోకి
బీఎస్ఎన్ఎల్ నగరంలో సొంతంగా వైఫై హాట్స్పాట్స్ను ఏర్పాటు చేయబోతుంది. మొబైల్ వినియోగదారులు ప్రస్తుతం 4జీ సేవలను ఆశిస్తుండటం.. బీఎస్ఎన్ఎల్ సేవలు 3జీకి పరిమితం కావడంతో వైఫై ద్వారా వేగవంతమైన డాటా సేవలపై దృష్టి పెట్టింది. దీంతో 4 జీ సవాళ్లను అధిగమించవచ్చని విశ్వసిస్తోంది.
హైదరాబాద్: నగరంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు నెలనెలా పెరుగుతున్నారు. సాధారణ ఫోన్ల నుంచి స్మార్ట్కు అప్గ్రేడ్ అవుతున్నారు. దీంతో అంతర్జాల సేవలకు డిమాండ్ పెరుగుతోంది. అందునా వేగవంతమైన సేవలను వినియోగదారులు కోరుకుంటున్నారు. దీన్ని గుర్తించినా బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే నగరంలో సర్వే పూర్తి చేసింది. ముఖ్యంగా పర్యాటక, వ్యాపార, రద్దీ ప్రదేశాలు, ఆసుపత్రులు, 3జీ ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ప్రదేశాలను వైఫై కోసం ఎంపిక చేశారు. కొత్తగా హాట్స్పాట్స్ను ఏర్పాటు చేసే ఇటువంటి 50 ప్రదేశాలను గుర్తించారు. వీటి పరిధిలో 238 చోట్ల యాక్సెస్ పాయింట్లను ఏర్పాటు చేయబోతున్నారు. హాట్స్పాట్స్కు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు కాంట్రాక్ట్ను ఎల్అండ్టీ సంస్థకు అప్పగించారు. మార్చిలో కొత్త ప్రదేశాల్లో బీఎస్ఎన్ఎల్ వైఫై అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 4 జీ కంటే వేగంగా 4.5 జీతో వైఫై సేవలను అందించబోతున్నట్లు చెప్పారు.
భాగస్వామితో కలిసి..
నగరంలో ఇప్పటికే 40కి పైగా వైఫై హాట్స్పాట్స్ను క్వాడ్జెన్తో కలిసి బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేసింది. 2015 ఏప్రిల్లో హుస్సేన్సాగర్ చుట్టూ మొదలైన వైఫై సేవలు.. తర్వాత మరిన్ని ప్రాంతాలకు విస్తరించారు. ప్రధాన నగరంలోనే ప్రస్తుతం ఈ సేవలు పరిమితంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. హాట్స్పాట్ పరిధి దాటితే సిగ్నల్ సమస్యలు ఎదురవుతున్నాయి. నగరమంతటా సిగ్నల్స్ అంతరాయం లేకుండా 2000 వరకు వైఫై హాట్స్పాట్స్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ మంత్రి ప్రకటించినా ఆ స్థాయిలో ఏర్పాటు కాలేదు. కొత్తగా మరో 50 చోట్ల ఏర్పాటు చేస్తుండటంతో వైఫై నెట్వర్క్ మెరుగుపడనుంది. బీఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదారులు హాట్స్పాట్ పరిధిలోకి రాగానే ఆటోమేటిక్గా వైఫై కనెక్ట్ అవుతుందని అధికారులు అంటున్నారు. దీని వేగం 4.5 జీ కాబట్టి 4జీ వేగం లేదనే లోటు 3జీ వినియోగదారులకు ఉండదని చెబుతున్నారు.
జియోతో తగ్గిన వినియోగం
రియలన్స్ జియో కొంతకాలంగా ఉచితంగా డాటా సేవలను అందిస్తుండటంతో ఆ ప్రభావం అన్ని టెలికాం సంస్థల అంతర్జాల సేవలపై పడింది. వేల టెరాబైట్ డాటాను ఉపయోగిస్తున్నారు. సహజంగానే సిటీలో ఇప్పటి వరకు బీఎస్ఎన్ఎల్, క్వాడ్జెన్తో కలిసి ఏర్పాటు చేసిన వైఫై హాట్స్పాట్స్పై ఈ ప్రభావం పడింది. ఇక్కడ మొదటి మూడుసార్లే ఉచితం కావడం.. ఆ తర్వాత రీఛార్జ్ చేసుకోవాల్సి ఉండటంతో వినియోగం కొంత తగ్గిందని బీఎస్ఎన్ఎల్ అధికారులు అన్నారు. గత ఏడాది జూన్ నుంచి నవంబరు నెల వరకు 40 హాట్స్పాట్స్లో 3.46 లక్షల సార్లు వైఫైని వినియోగించారు. వీరిలో 1.51 లక్షల మంది మొదటిసారి ఈ సేవలను పొందారు. 62.19 లక్షల జీబీని వినియోగించారు. డిసెంబరు తర్వాత జియో రావడంతో వైఫై సేవల వినియోగం చాలావరకు పడిపోయింది. కేవలం బీఎస్ఎన్ఎల్ వైఫైనే కాదు.. ఇతర ఇంటర్నెట్ సంస్థలు అందజేస్తున్న వాటిపైనా ప్రభావం పడింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







