అమరావతికి ఐటీ కళ...

- February 17, 2017 , by Maagulf
అమరావతికి ఐటీ కళ...

'ఉత్తమ భవిష్యత కోసం మీ బిడ్డలను అప్పుడు విదేశాలకు పంపాను.. ఇపుడు రాష్ట్ర భవిష్యత్ కాపాడేందుకు మీ బిడ్డలను మీ దగ్గరకు తీసుకువచ్చాను. మీకు సంతోషమేనా!' ఎన్‌ఆర్‌ఐల మాతృమూర్తులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న మాటలివి. నగరంలోని ఆటోనగర్‌లో ఇండ్‌వెల్‌ స్క్వేర్‌ భవనంలో 8 ఐటీ(ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ) కంపెనీలను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన ఎన్‌ఆర్‌ఐలకు చెందిన మాతృమూర్తులతో మాట్లాడారు. మనసువిప్పి మాట్లాడిన ఓ మాతృమూర్తితో ఆయన అన్న మాటలకు ఓ తల్లి కళ్లు చెమ్మగిల్లాయి. 'మీలాంటి తల్లులు ఆశీర్వదించాలి.. ఆవేదన చెందద్దు, నేనున్నాను' అంటూ ఆయన ముందుకు సాగారు.
అమెరికాలో స్థిరపడ్డ ఎన్‌ఆర్‌ఐలకు చెందిన కంపెనీలను అమరావతికి తీసుకురావడంలో ఎన్‌ఆర్‌టీ(నాన్‌ రెసిడెన్షియల్‌ తెలుగు అసోసియేషన్‌) కృషి అనిర్వచనీయమని సీఎం కొనియాడారు. మూడు అంతస్తుల్లో ఏర్పాటుచేసిన కంపెనీలను ఆయన పరిశీలించారు. ప్రతినిధులతో కాసేపు ముచ్చటించారు. ఐటీ కంపెనీలకు కావలసిన మౌలిక సదుపాయాలను అందిం చేందుకు ఏపీ ప్రభుత్వం ఎపుడూ ముందుంటుందని ప్రతినిధులకు ఆయన హామీ ఇచ్చారు. 
50 శాతం అద్దె రాయితీ 
విదేశాలకు చెందిన 'ఐటీ సర్వ్‌' అలయన్స్‌తో ఉన్న 7 కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రత్యేక రాయితీలు అందించింది. వాటిలో 50 శాతం అద్దె రాయితీ ప్రధానం. వాటితోపాటు ప్రతీ ఉద్యోగికి రూ.లక్షన్నర చొప్పున కంపెనీకి 2020 దాకా చెల్లించే విధంగా చేసుకున్న ఒప్పందం, కార్పొరేషన్‌ కలిగిన సామాజికవర్గ యువతకు ఉచితంగా ఐటీ శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సహకరిస్తుంది. కంపెనీ ఏర్పాటుచేయాలని నిర్ణయించిన భవనానికి చెందిన యజమాని నుంచి మూడేళ్లకు ప్రభుత్వం లీజుకు తీసుకుంటుంది. చదరపు అడుగుకు రూ.60 చొప్పున ప్రభుత్వం చెల్లించేందుకు లీజు ఒప్పందం కుదుర్చుకుంటుంది. కంపెనీలు అందులో రూ.30 చెల్లిస్తుంది. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీ కింద అందిస్తుంది. ఈ కంపెనీలకు విద్యుత, ఇంటర్‌నెట్‌ తదితర అంశాలకు సంబంధించి ఇచ్చే సబ్సిడీకి బదులుగా ఉద్యోగి పేరున ప్రతి ఏటా రూ.లక్షన్నర ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరిందని ఎన్‌ఆర్‌టీ సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. 
కార్పొరేషన్ల యువతకు ఉచిత శిక్షణ 
ముఖ్యంగా తమ కంపెనీలలో చేరదలుచుకున్న యువతకు కావలసిన నైపుణ్యాలకు ఇక్కడే తర్ఫీదు ఇస్తారు. ఇందుకు సంబంధించి అభ్యర్థులు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉండగా.. ప్రభుత్వం రాయితీని అందిస్తోంది. కార్పొరేషన్లు కలిగిన సామాజికవర్గాల యువతకు శిక్షణ ఫీజును ఆ కార్పొరేషన్ల నుంచి చె ల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కార్పొరేషన్లు లేని సామాజికవర్గాలలో ఆర్థికంగా వెనుకబడ్డ వారికి ఎన్‌ఆర్‌ఐ ఫండ్స్‌ నుంచి ఉచితంగా శిక్షణ అందించే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. 
ఏపీ ఎన్‌ఆర్‌టీ ప్రారంభం 
ఐటీ కంపెనీలలో ఉన్న అవకాశాలను ఎప్పటికపుడు నిరుద్యో యువతకు అందించే విధంగా ఏర్పాటుచేసిన www.itcentral.in వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఇందులో ఏపీ ఐటీకి సంబంధించిన ఉపాధి అవకాశాలు, అవసరమయిన అర్హతలు, శిక్షణ ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు, కంపెనీల వివరాలు తదితర సమాచారం ఉంటుంది. సీపీ గౌతమ్‌ సవాంగ్‌ చర్చావేదిక కార్యక్రమానికి విచ్చేసిన వారితో నగర పోలీస్‌ కమిషనర్‌ చర్చావేదిక నిర్వ హించారు. ఒక ఐటీ ఉద్యోగి మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్‌ పెరిగిపోయిందని, ప్రయాణికులు పలు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, దీనిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. దానికి సీపీ సమాధానం చెబుతూ బెంజిసర్కిల్‌ నుంచి రమేశ్‌ హాస్పిటల్‌ వరకు ఫ్లైఓవర్‌ మంజూరయిందన్నారు. అది పూర్తయితే ట్రాఫిక్‌ దాదాపు నియంత్రించగలుగుతామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి శ్రమను ఓర్చి ఐటీ కంపెనీలను తీసుకువస్తున్నారని చెప్పారు. మరికొందరు ఉద్యోగులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com