సౌదీ రాజు ఫారిన్ వెడలే..!

- February 28, 2017 , by Maagulf
సౌదీ రాజు ఫారిన్ వెడలే..!

హం గూ ఆర్భాటానికి పెట్టింది పేరు సౌదీ రాజకుటుంబం.. ఆ పేరు నిలబెట్టుకునే విధంగానే ఇప్పుడు సౌదీరాజు ఇండోనేషియా పర్యటన ఉంది. 46ఏళ్ల తర్వాత సౌదీ రాజు సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌదీ ప్రపంచలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియాలో పర్యటించనున్నారు. దీంతో ఈ పర్యటనకు ఎక్కడలేని ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పర్యటనకు తాజాగా ఇప్పుడు ఇంకో ప్రాముఖ్యత కూడా తోడైంది. ఈ పర్యటన కోసం మొత్తం 459 మెట్రిక్‌ టన్నుల లగేజీని తీసుకువెళ్లనున్నారు. వీటిల్లో రెండు రెండు మెర్సిడెస్‌ బెంజ్‌ ఎస్‌600 లీమోసిన్స్‌, రెండు విద్యుత్తు ఎలివేటర్లు కూడా ఉన్నాయి.
ఈ లగేజీని తరలించడానికి జాస్‌ అనే ఎయిర్‌ ఫ్రైట్‌ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. ఈ లగేజీ ఇప్పటికే ఇండోనేషియాకు చేరిపోయింది. 572 మంది పనివాళ్లు ఈ లగేజీ తరలింపులో పాల్గొన్నట్లు తెలిపింది.
2015లో సౌదీ రాజు వాషింగ్టన్‌ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ జార్జ్‌టౌన్‌లోని ఫోర్‌ సీజన్స్‌ హోటల్‌ మొత్తాన్ని బుక్‌ చేసుకున్నారు. అమెరికాలోనే అత్యంత విలాసవంతమైన హోటళ్లలో అది కూడా ఒకటి. ఇక్కడ దాదాపు 222 గదులు ఉన్నాయి. అదే ఏడాది సౌదీ రాజు ఫ్రాన్స్‌ పర్యటన విమర్శలకు తావిచ్చింది. ఆయన అక్కడకు 1,000 మంది సిబ్బందిని వెంటేసుకొని వెళ్లాడు. వారు తీరంలోని ది ఫ్రెంచ్‌ రివేరా ప్రాంతలో బస చేశారు. అక్కడ ఇసుకలో అనుమతిలేకుండా కాంక్రీట్‌తో నిర్మాణాలు చేపట్టినట్లు స్థానిక మేయర్‌ ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. ఈసారి ఇండోనేషియా పర్యటనకు కూడా ఆయన దాదాపు 1500 మందిని తోడు తీసుకువెళుతున్నారు. వీరిలో 10 మంది మంత్రులు, 25 మంది రాకుమారులు, 100 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు.
ప్రపంచ నేతల విషయానికొస్తే.. 2013లో అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆఫ్రికా పర్యటన కూడా భారీగానే సాగింది. అక్కడకు ఆయన దాదాపు 56 వాహనాలను తీసుకెళ్లారు. వీటిల్లో 14 లీమోసిన్స్‌ ఉన్నాయి. వందల మంది సీక్రెట్‌ సర్వీసు సిబ్బంది కూడా ఈ పర్యటనలో ఆయన వెంట ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com