తొలిసారి ఓటమి పాలైన బ్రిటిష్ ప్రధాని థెరెసా

- March 02, 2017 , by Maagulf
తొలిసారి ఓటమి పాలైన బ్రిటిష్ ప్రధాని థెరెసా

బ్రెగ్జిట్ అనంతరం బ్రిటిష్ ప్రధాన మంత్రి థెరెసా మే మొదటి పరాజయాన్ని రుచి చూశారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బయటపడుతున్న బ్రిటన్‌లో ఈయూ పౌరుల హక్కుల రక్షణకు హామీనిచ్చే సవరణకు అనుకూలంగా హౌస్ ఆఫ్ లార్డ్స్ ఓటు వేసింది. థెరెసా కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలు. ఆ పార్టీకి ఈ సభలో ఆధిక్యత లేదు. బుధవారం జరిగిన ఓటింగ్‌లో 358-256 తేడాతో ఈ సవరణ ఆమోదం పొందింది. బ్రెగ్జిట్ తర్వాత యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉండే ఈయూ జాతీయులను మంత్రులు కాపాడాలని ఈ సవరణ చెప్తోంది. వీరికి నివాస హక్కులు కూడా సమానంగా ఉండేలా ప్రభుత్వం అధికరణ 50 ప్రకారం మూడు నెలల్లోగా ప్రతిపాదనలను ప్రవేశపెట్టవలసి ఉంటుంది. ఈయూ నుంచి బయటపడేందుకు సన్నాహాలు చేస్తున్న డిపార్ట్‌మెంట్ స్పందిస్తూ కామన్స్ సభ సవరణలేవీ లేకుండా ఆమోదించిన బిల్లును సవరించాలని లార్డ్స్ నిర్ణయించడం పట్ల నిరుత్సాహాన్ని వ్యక్తం చేసింది. థెరెసా మే మాట్లాడుతూ ఈయూ జాతీయుల హక్కులకు ఇచ్చే ఎటువంటి హామీ అయినా విదేశాల్లో ఉంటున్న బ్రిటన్ వలసదారులను పరిరక్షించే ఒప్పందంలో భాగంగా ఉండాలని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com