వీసాలపై బ్రిటన్ భారీ వసూళ్లు

- April 04, 2017 , by Maagulf
వీసాలపై బ్రిటన్ భారీ వసూళ్లు

ఐటీ, హెల్త్, ఎడ్యుకేషన్ తదితర రంగాల ప్రొఫెషనల్స్ కు వీసాలు జారీ చేసే విషయంలో బ్రిటన్ సరికొత్త ప్రతిబంధకాలను విధించనుంది. బ్రిటన్ లోని ఆయా సంస్థల్లో పనిచేస్తూ, ఎక్కువ మొత్తంలో వేతనాలు పొందే వలస ఉద్యోగుల నుంచి భారీ మొత్తంలో 'వసూళ్లు' చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇమిగ్రేషన్ స్కిల్ చార్జీలు, హెల్త్ సర్ చార్జీలు తదితర రూపాల్లో ఏటా 200 పౌండ్ల నుంచి 1000 పౌండ్ల దాకా వసూలు చేయనున్నారు. ఏప్రిల్ 6(గురువారం) నుంచే ఈ నూతన నిబంధనలు అమలులోకి వస్తాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

వీసాల విషయంలో బ్రిటన్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్ సహా యురోపియన్ యూనియన్ లో సభ్యులు కాని దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. బ్రెగ్జిట్ అనంతరం బ్రిటన్ స్వతంత్ర ఆర్థిక శక్తిగా నిలబడాలంటే ఉద్యోగాల్లో అధిక భాగం స్థానికులకే దక్కాలన్నది అక్కడి ప్రభుత్వ ఆలోచన. అందుకే, ఏప్రిల్ 6 నుంచి వలసదాల నుంచి వసూలయ్యే పన్నుల ద్వారా నిధిని ఏర్పాటుచేసి, ఆ నిధిలో నుంచి అధిక మొత్తాన్ని బ్రిటిషర్లకు ఉద్యోగాల కల్పన కోసం పనిచేసే సంస్థలకు ప్రోత్సాహకాలుగా ఇవ్వనున్నారు.

అలాగే ఇంటర్ కంపెనీ ట్రాన్స్ ఫర్ (ఐసీటీ)పై బ్రిటన్ లో పనిచేసేందుకు వచ్చే ప్రొఫెషనల్స్ , టైర్ 2, డిపెండెంట్ వీసాలపై కూడా ఇదే తరహాలో బాదుడు ఉండబోతోంది. కాగా, ఇమిగ్రేషన్ స్కిల్ చార్జీలు, హెల్త్ సర్ చార్జీల భారాన్ని ఆయా సంస్థలే భరించాలని నిబంధనల్లో పేర్కొనడంతో పరిశ్రమ వర్గాల్లో ఆందోళన నెలకొంది. అంతేకాదు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేషన్ లోనూ మరికొన్ని నిబంధనలు చేర్చారు. మొత్తంగా వీసా ప్రక్రియ ఖర్చు పెరగడంతోపాటు, కఠినతరమవుతుంది. వచ్చే ఏడాది నుంచి ఈ నిబంధనలన్నీ  యురోపియన్ యూనియన్ దేశాల నుంచి వచ్చే ఉద్యోగార్థులకూ వర్తింపజేసే అవకాశం ఉంది.  అమెరికాలో ట్రంప్ రాకతో మొదలైన వీసాలపై కఠిన నిబంధనలు మొదలుకావడం, మొన్న మలేషియా, నేడు బ్రిటన్.. ఇలా క్రమంగా పలు దేశాలు కూడా అమెరికా బాటలో పయనిస్తుండటం.. మేధోవలసలు అధికంగా ఉండే భారత్ లాంటి దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com