ఆత్మవిశ్వాసంతో ఎవరెస్టు ఎంత ఎత్తయినా ఎక్కేస్తాం

- April 06, 2017 , by Maagulf
ఆత్మవిశ్వాసంతో ఎవరెస్టు ఎంత ఎత్తయినా ఎక్కేస్తాం

వారంతా రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. అయినా ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో..సముద్రమంత ధీమాతో ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టును అధిరోహించేందుకు సమాయత్తమవుతున్నారు. 60 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు యువజన వ్యవహారాల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బృందానికి చెందిన ధర్మతేజ, సత్యారావు, చెన్నారావు, భరత్‌, నాగరాజు, పార్వతిలకు ఆయన జెండాను అందజేశారు. మొత్తం ఆరుగురు యువ పర్వతారోహకులతో పాటు ఓ శిక్షకుడు, వైద్యుడు ఈ బృందంలో ఉన్నారు. ఈ నెల 8న వీరు విజయవాడ నుంచి బయలుదేరి.. దిల్లీ మీదుగా నేపాల్‌ రాజధాని ఖాట్మండు వెళ్తారు.
అక్కడి నుంచి సామగ్రి, షేర్పాలతో కలసి లాసాకు చేరుతారు. అక్కడి బేస్‌ క్యాంపు నుంచి ఎవరెస్టు అధిరోహణ పర్వం మొదలవుతుంది. యువతలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపేందుకు గత ఏడాది రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం 300 మందిని ఎంపిక చేసి, దశలవారీగా వడబోసి చివరకు ఆరుగుర్ని ఎంపిక చేశారు. మే నెల చివరికల్లా ఎవరెస్టును అధిరోహించి.. భారత్‌, ఆంధ్రప్రదేశ్‌ పతాకాలను ఎగురవేస్తామని వీరంతా ధీమాగా చెబుతున్నారు.
యువతకు అన్ని రంగాలలో శిక్షణ: మంత్రి: రాష్ట్రంలోని యువతకు అన్ని రంగాలలో అవసరమైన శిక్షణ ప్రభుత్వం ఇప్పిస్తుందని మంత్రి రవీంద్ర అన్నారు. గురువారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం రూ.2.40 కోట్లతో యువతకు ఎవరెస్ట్‌ అధిరోహించే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ ప్రయత్నంలో వారు విజయం సాధించి దేశ, రాష్ట్ర పతాకాలను రెపరెపలాడించాలని ఆకాంక్షించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com