రైతు రుణమాఫీ పూర్తి: తెలంగాణ ప్రభుత్వం

- April 11, 2017 , by Maagulf
రైతు రుణమాఫీ పూర్తి:  తెలంగాణ ప్రభుత్వం

ఆఖరి విడత రూ. 4 వేల కోట్లు విడుదల చేసిన సర్కారు
ఖరీఫ్‌కు రెండు నెలల ముందే చెల్లింపు
మొత్తం రుణమాఫీ నిధులు రూ.16,374 కోట్లు
లబ్ధి పొందిన రైతులు 35.3 లక్షల మంది
తాజా నిధుల్లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల వాటా కూడా..
ఆర్‌బీఐ బాండ్ల వేలం ద్వారా నిధుల సమీకరణ
కొంత గందరగోళం మినహా పథకం సక్సెస్‌  

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రైతుల రుణమాఫీ దాదాపు పూర్తయింది. ఈ పథకానికి సంబంధించిన ఆఖరి విడత నిధులు రూ.4,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. మొత్తంగా 35.3 లక్షల మంది రైతులు రుణమాఫీ ద్వారా లబ్ధిపొందగా.. ప్రభుత్వం మొత్తంగా రూ.16,374 కోట్లను బ్యాంకులకు చెల్లించింది.

కొంత గందరగోళం మధ్య..
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తంగా దాదాపు రూ.17 వేల కోట్లను నాలుగేళ్ల వ్యవధిలో నాలుగు విడతలుగా మిబ్యాంకులకు చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది. తొలి ఏడాది రూ.4,250 కోట్లు ఒకేసారి విడుదల చేసింది. పెద్ద మొత్తం కావటం, నిధుల సమీకరణ ఇబ్బందుల దృష్ట్యా రెండో ఏడాది, మూడో ఏడాదిలో నిధులను రెండు భాగాలుగా చెల్లించింది. దీంతో ఈ పథకం అమల్లో కొంత గందరగోళం తలెత్తింది. బ్యాంకులకు నిధులు చేరడం ఆలస్యమైంది. కొన్ని జిల్లాల్లో బ్యాంకర్లు రైతుల నుంచి బలవంతంగా వడ్డీ వసూలు చేశారు కూడా. వీటన్నింటి నేపథ్యంలో విపక్షాలు సైతం రుణమాఫీ అంశంపై విరుచుకుపడ్డాయి.

ఇటీవల కాగ్‌ తమ నివేదికలో రుణమాఫీ పథకం అమలు తీరును ప్రధానంగా ప్రస్తావించింది కూడా. అయితే తొలి ఏడాది తరహాలోనే చివరి ఏడాది నిధులను ఒకేసారి చెల్లిస్తామని ఇటీవల బడ్జెట్‌ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అంతేకాదు ఆఖరి విడత నిధులను ఖరీఫ్‌ ప్రారంభానికి రెండు నెలల ముందే విడుదల చేశారు.

రూ.16,374 కోట్లు మాఫీ
మొత్తంగా సుమారు 36 లక్షల మంది రైతులకు చెందిన రూ.17 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం తొలుత ప్రకటించింది. ఈ పథకం అమల్లో భాగంగా రెండో ఏడాది చెల్లింపుల సమయంలో పలువురు బోగస్‌ రైతులు, రెండేసి ఖాతాలున్న రైతులను లబ్ధిదారుల నుంచి తొలగించారు. దాంతో రుణమాఫీ మొత్తం రూ.16,374 కోట్లుగా ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. అందులో గతేడాది వరకు చెల్లించిన రూ.12,374 కోట్లుపోగా.. మిగతా రూ.4,000 కోట్లను తాజాగా విడుదల చేశారు. మొత్తంగా 35.3 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ అయ్యాయని వ్యవసాయశాఖ పేర్కొంది. బ్యాంకుల బ్రాంచీల వారీగా లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com