భీమ్-ఆధార్ యాప్ ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
- April 14, 2017
దేశంలో డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే దిశగా మరో ముందడుగు పడింది. అంబేడ్కర్ 126వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ భీమ్-ఆధార్ యాప్ను ఈరోజు నాగ్పూర్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భీమ్-ఆధార్ యాప్ ద్వారా మరిన్ని నగరాల్లో నగదు రహిత లావాదేవీలకు అవకాశం ఏర్పడుతుందన్నారు.
దళిత, బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం జీవితాంతం కృషి చేసిన వ్యక్తి అంబేడ్కర్ అని మోదీ కొనియాడారు. అవమానాలు ఎదుర్కొన్నా.. ఆయనలో ప్రతీకార ధోరణి ఎక్కడా కనిపించలేదన్నారు. జీవితంలో చేదు అనుభవాలున్నా.. మనకు మాత్రం అమృతాన్నే పంచారని పేర్కొన్నారు. భీమ్-ఆధార్ యాప్ను ఆయనకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు.
భీమ్యాప్లో భాగంగా పనిచేసే భీమ్-ఆధార్ ప్లాట్ఫాం వ్యాపారుల కోసం ఉద్దేశించింది. భీమ్ యాప్ ప్రారంభించిన నాలుగు నెలల్లో 1.9 కోట్ల డౌన్లోడ్లతో ఇప్పటికే కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ఆధార్ను ఉపయోగించడం ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయడానికి భీమ్-ఆధార్ ఉపయుక్తంగా ఉంటుందని కేంద్రం భావిస్తోంది. వ్యాపారుల వద్ద ఉన్న బయోమెట్రిక్ ఉపకరణం ద్వారా భారత పౌరులు తమ వేలిముద్రలతో డిజిటల్ రూపంలో చెల్లింపులు చేయడానికి వీలయ్యేలా యాప్ రూపొందించింది. దీని ద్వారా స్మార్ట్ఫోనే బయోమెట్రిక్ ఉపకరణంగా ఉపయోగపడనుంది. ఇప్పటికే మూడులక్షల మంది వ్యాపారులు 27 ప్రధాన బ్యాంకులతో అనుసంధానమై ఉన్నారని, భీమ్-ఆధార్తో చెల్లింపుల స్వీకరణ ప్రారంభించవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించేందుకు భీమ్ యాప్కు అనుసంధానంగా ప్రధాని మరో రెండు పథకాలను కూడా మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఒక పథకం నగదు వాపసు పథకం కాగా మరొకటి రిఫరల్ బోనస్ పథకం.
ఈ రెండింటి కింద రూ.495 కోట్లను ప్రోత్సాహంగా ఇస్తారు. భీమ్ యాప్ ద్వారా చెల్లింపులను స్వీకరిస్తున్నందుకు వ్యాపారులను ప్రోత్సహించేందుకు నగదు వాపసు పథకాన్ని, ప్రస్తుత వినియోగదారులు వేరే వినియోగదారులను సిఫార్సు చేసినందుకు రిఫరల్ బోనస్ పథకాన్ని ఉద్దేశించారు.
దేశంలో డిజిటల్ చెల్లింపు విప్లవానికి భీమ్-ఆధార్ యాప్, ఈ రెండు ప్రోత్సాహ పథకాలు దోహదం చేయనున్నాయి. డిజిటల్ చెల్లింపులకు ప్రాచుర్యం కల్పించడానికి ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన రెండు ప్రోత్సాహ పథకాల మెగా డ్రాలో విజేతలకు ప్రధాని పురస్కారాలను అందజేశారు. వినియోగదారుల కోసం లక్కీ గ్రాహక్ యోజనను, వ్యాపారుల కోసం డిజిధన్ వ్యాపార్ యోజనను ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ రెండింటి కింద 16లక్షల మంది వినియోగదారులు రూ.258 కోట్లను గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







