సిలికానాంధ్ర యూనివర్సిటీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన

- May 06, 2017 , by Maagulf
సిలికానాంధ్ర యూనివర్సిటీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన

ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ను తయారు చేయాలన్నది తమ ప్రణాళిక అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా మూడో రోజు పలువురు సీఈవోలతో సమావేశాలు నిర్వహించారు. సిలికానాంధ్ర యూనివర్సిటీలో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. నవ్యాంధ్రప్రదేశ్‌ 15 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వచ్చే పదిహేను ఏళ్లలో ఇదే స్థాయిలో సుస్థిర వృద్ధి సాధించాలని వ్యూహాత్మక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. అమెరికాలో పెట్టుబడుల వేట కొనసాగిస్తున్న చంద్రబాబు.. సిలికానాంధ్ర యూనివర్సిటీలో ప్రసంగించారు. యూనివర్సిటీని సందర్శించిన సీఎం.. అక్కడి వారితో ముఖాముఖి అయ్యారు. యూనివర్సిటీలో అమరావతి స్కూల్‌ ఆఫ్‌ తెలుగు లింగిస్టిక్స్‌ ఏర్పాటు కోసం ఆరు కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆవిష్కరణలకు ఆలంబనగా నిలిచిన ఈ ప్రదేశం నుంచి ప్రసంగించడం సంతోషంగా ఉందని చంద్రబాబు చెప్పారు. రాబోయే మూడు నాలుగు దశాబ్దాలు మనవేనన్నారు. మోడీ నాయకత్వం దేశానికి భరోసగా నిలిచిందన్న చంద్రబాబు.. ఏపీలో 15 శాతం వృద్ధి సాధనే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ పరిజ్ఞానమంతా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించాలన్నారు. అగ్రి ప్రాసెసింగ్‌, అపెరల్‌, ఆక్వా రంగాల్లో మీకోసం ఏపీలో అవకాశాలు ఎదురుచూస్తున్నాయంటూ వారికి ఆహ్వానం పలికారు చంద్రబాబు. రాష్ట్రాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా చేయాలన్న తన ప్రయత్నానికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు టాప్‌ ఇండియన్‌ సీఈవోలతో చంద్రబాబు సమావేశమయ్యారు. అమెరికా వ్యాపార, పరిపాలన రంగాల్లో అత్యంత ప్రభావశీలిగా ఉన్న అరుణ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి భారత్‌కు చెందిన అగ్రశ్రేణి వాణిజ్య, సాంకేతిక ప్రముఖులు హాజరయ్యారు. సమావేశంలో అమెరికా మాజీ రాయబారి, భారతీయ సంతతికి చెందిన వినయ్‌ తుమ్మలపల్లి కూడా పాల్గొన్నారు. వీరందరితో పెట్టుబడులపై సీఎం చర్చలు జరిపారు. ఇక సిలికానాంధ్ర యూనివర్సిటీలో పర్యటన అనంతరం ముఖ్యమంత్రి డల్లాస్‌ నగరానికి బయలుదేరి వెళ్లారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com