మహిళపై జెట్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది దారుణంగా దాడి చేసారు

- May 07, 2017 , by Maagulf
మహిళపై జెట్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది దారుణంగా దాడి చేసారు

ఓ మహిళపై జెట్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది దారుణంగా ప్రవర్తించారు. విమానాశ్రయానికి అనుకున్న సమయానికన్నా గంట ముందుగానే వెళ్లిన ప్రయాణికురాలితో దురుసుగా ప్రవర్తించడమేకాకుండా ఆమెపై చేయిచేసుకున్నారు. దాంతో ఆమె ముఖంపై తీవ్ర గాయమైంది. ఈ ఘటన మే 3న దిల్లీ విమానాశ్రయంలోచోటుచేసుకుంది.
ఈ ఘటనను బాధితురాలి కుమారుడు కవల్‌జీత్‌ సింగ్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో వెలుగులోకి వచ్చింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయవాదైన కవల్‌జీత్‌ తన తల్లి పట్ల ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది ప్రవర్తించిన తీరుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా అమ్మ మే 3న దిల్లీ నుంచి కోల్‌కతాకి జెట్‌ ఎయిర్‌వేస్‌లో వెళ్లాల్సి ఉంది. విమానం 10.50కి బయలుదేరాల్సి ఉన్నా ఆమె గంట ముందే విమానాశ్రయానికి చేరుకుంది. లగేజ్‌ చెకింగ్‌ సమయంలో బ్యాగులో పరిమితికి మించిన సామాన్లు ఉన్నాయని రూ.5,500 జరిమానా విధించారు. బ్యాగులు ఓవర్‌ వెయిట్‌ ఉన్నాయని వాటిని విసిరేశారు. నేను మా అమ్మను ఎయిర్‌పోర్ట్‌లో దించిన గంటకే ఆమె స్పృహ కోల్పోయి రక్తపు మడుగులో పడి ఉన్నట్లు ఫోన్‌ వచ్చింది. హుటాహుటిన అక్కడికి చేరుకుని అమ్మను హాస్పిటల్‌కి తీసుకెళ్లాను. ఆమె దవడ భాగానికి సర్జరీ చేశారు. అమ్మ స్పృహలోకి వచ్చాక తన పట్ల సిబ్బంది ప్రవర్తించిన తీరు గురించి చెప్పింది. ఈ ఎయిర్‌లైన్‌ సిబ్బంది ఆగడాలు ఎప్పటికి తగ్గుతాయో’ అంటూ కవల్‌జీత్‌ తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లోఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే కవల్‌జీత్‌ చెప్తున్నవన్నీ అబద్ధాలేనని ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది ఆరోపించారు. అతని తల్లి చెకిన్‌ కౌంటర్‌ వద్దకు ఆలస్యంగా వచ్చినా విమానం ఎక్కడానికి అనుమతించామని ఇంతలో ఆమె అనార్యోగంతో కళ్లు తిరిగి పడిపోయారని చెప్తున్నారు. వైద్యులు ఇచ్చిన మెడికల్‌ రిపోర్ట్‌లో కూడా కవల్‌జీత్‌ తల్లి డయాబెటీస్‌తో బాధపడుతున్నట్లు ఉందని తేలింది. ఈ విషయం గురించి దర్యాప్తు చేయించడానికి మే 3న రికార్డ్‌ అయిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులకు ఇచ్చినట్లు ఎయిర్‌లైన్స్‌ యాజమాన్యం వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com