29 నుంచి 3 దేశాల పర్యటనకు ప్రధాని మోడీ

- May 17, 2017 , by Maagulf
29 నుంచి 3 దేశాల పర్యటనకు ప్రధాని మోడీ

 వివిధ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంతో పాటు భారత్‌కు పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ప్రధాని నరేంద్రమోదీ మూడు దేశాల పర్యటన చేపట్టనున్నారు. జర్మనీ, స్పెయిన్‌, రష్యాల్లో ఆయన ఈ నెల 29 నుంచి అయిదు రోజుల పాటు పర్యటిస్తారు. జర్మనీ, స్పెయిన్‌ దేశాల పర్యటన ద్వైపాక్షికమైనది. రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో జూన్‌ 1 నుంచి 3వ తేదీ వరకు జరిగే ‘అంతర్జాతీయ ఆర్థిక వేదిక’ సదస్సులో మోదీ పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది వ్యాపారాధినేతలు హాజరయ్యే ఈ సదస్సు ద్వారా భారత్‌కు పెట్టుబడుల్ని ఆకట్టుకునేందుకు మోదీకి ఒక అవకాశం లభించనుంది. దీంతోపాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తోనూ మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ-అణు ఇంధన సహకారం వంటి అంశాలు దీనిలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి. తమిళనాడులోని కూదంకుళం అణు విద్యుత్తు కర్మాగారంలోని 5, 6 యూనిట్లపై ఒప్పందాన్ని ఖరారు చేయడంపై భారత్‌-రష్యా మధ్య చర్చలు జరుగుతున్నాయి. మోదీ పర్యటనలో ఈ ఒప్పందంపై సంతకాలు జరుగుతాయా లేదా అనేది స్పష్టం కాలేదు. ప్రస్తుతం ఈ ఒప్పందం ప్రధానమంత్రి కార్యాలయం పరిశీలనలో ఉంది.

ముందుగా జర్మనీకి...: మోదీ ముందుగా జర్మనీ వెళ్తారు. వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలపై ఆ దేశ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కల్‌తో చర్చిస్తారు. రెండేళ్లలో మోదీ జర్మనీ వెళ్లడం ఇది రెండోసారి. మౌలిక సదుపాయాలు, ఇంధన రంగాలపై స్పెయిన్‌తో ఆయన చర్చిస్తారు.

ఈ మూడు దేశాల పర్యటన ముగించుకుని వచ్చాక మోదీ కజకిస్థాన్‌ వెళ్తారు. ఆస్తానాలో జూన్‌ 7-8 తేదీల్లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశాల్లో పాల్గొంటారు. ఆ సమావేశానికి పాక్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అమెరికా, ఇజ్రాయెల్‌లలోనూ మోదీ పర్యటన చేపట్టనున్నా వాటి తేదీలు ఇంకా ఖరారు కాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com