ఖతార్‌లో వలస కార్మికులకు తప్పని కష్టాలు

- June 17, 2017 , by Maagulf
ఖతార్‌లో వలస కార్మికులకు తప్పని కష్టాలు

ఖతార్‌:ఖతార్‌ రాజధాని దోహాలోని ఒక నిర్మాణ రంగ కంపెనీలో అజిత్‌ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతడి నెల జీతం 1000 రియాళ్లు (సుమారుగా రూ.17 వేలు). ఇందులో తన ఖర్చులు పోనూ ఇంటికి రూ.7500 పంపుతున్నాడు. అయితే అజిత్‌ మొహంలో మునపటిలా ఆనందం లేదు. ఖతార్‌తో ఇతర అరబ్‌ దేశాలు దౌత్య సంబంధాలు తెగతెంపులు చేసుకోవటం, అక్కడి నిర్మాణ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఒక్క అజిత్‌ అనే కాదు, అతనిలాంటి కార్మికులెంతోమంది తమ ఉద్యోగాలు ఏమవుతాయో ? అన్న భయంతో రోజులు వెళ్లదీస్తున్నారు. 
దోహా : ఖతార్‌లో వలస కార్మికులు, ఉద్యోగుల పరిస్థితి ఏమీ బాగోలేదు. సౌదీ సహా ఇతర అరబ్‌ దేశాలు ఖతార్‌తో దౌత్య సంబంధాలు తెగతెంపులు చేసుకోవటమన్న నిర్ణయం వారికి ఊహించని కష్టాల్ని తెచ్చిపెట్టింది. ఆగేయాసియా దేశాల నుంచి వచ్చిన దాదాపు 20 లక్షల మంది ఖతార్‌లో వలస కార్మికులుగా పనిచేస్తున్నారు. భారత్‌, బంగ్లాదేశ్‌ నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. 
ఖతార్‌లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోవటం వీరిని తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్నది. మొదటి సమస్య...ఆహార కొర త కారణంగా భారీగా పెరిగిన నిత్యావసర ధరలు. రెండో సమస్య...ఉద్యోగ, ఉపాధి రంగంలో ఒక్కసారిగా పనులన్నీ ఆగిపోయాయి. ఎన్నో ఆశలతో ఇక్కడికొస్తే...తమకు ఏమాత్రం సంబంధంలేని, ఒక ఊహించని పరిణామం తమ జీవితాల్ని తలకిందులు చేసిందన్న ఆవేదన.
ఉగ్రవాద గ్రూపులకు ఖతార్‌ మద్దతు ఇస్తున్నదని, ఇరాన్‌తో సంబంధాలు నెరుపుతున్నదని సౌదీ అరేబియా సహా ఇతర అరబ్‌ దేశాలు దౌత్య సంబంధాల్ని తెగతెంపులు చేసుకున్నాయి. దీంతో ఖతార్‌లో సంక్షోభం మొదలైంది. 2022 ప్రపంచ ఫుట్‌బాల్‌ కప్‌కు ఖతార్‌ ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ఈ నేపథ్యంలో అక్కడ నిర్మాణ, హౌటల్‌, పర్యాటక రంగాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టుల్లో వలస కార్మికులుగా భారత్‌, బంగ్లాదేశ్‌ పౌరులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. దౌత్య సంబంధాల తెగతెంపులు...నిర్ణయంతో ఈ ప్రాజెక్టుల పనులన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. అంతర్జాతీయంగా పరిష్కారం కావాల్సిన ఈ సమస్య ఇలాగే కొనసాగితే...తమ పరిస్థితి దారుణంగా మారుతుందని వలస కార్మికులు ఆందోళన చెందుతున్నారు. 
ఖతార్‌ సమస్యపై పెద్ద ఎత్తున దౌత్యపరమైన చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇదంతా ఒక కొలిక్కి రావడానికి కొన్ని నెలలు పట్టేట్టు ఉంది. వెంటనే ఆంక్షల్ని తొలగించే పరిస్థితి కనపడటం లేదు. దీంతో వలస కార్మికుల ఉద్యోగ భద్రతపై అనుమానాలు ఏర్పడ్డాయి. ఖతార్‌ మార్కెట్‌లో అనిశ్చిత వాతావరణం నెలకొన్నది. దీనికి సంబంధించి వలస కార్మికుల్లో భరోసా కల్పించే...అధికార ప్రకటన ఖతార్‌ ప్రభుత్వం నుంచి రాలేదు.
తామంతా ఇక ఇంటికి వెళ్లిపోవాల్సి వస్తుందేమోనని చర్చ వలస కార్మికుల్లో పెద్ద ఎత్తున సాగుతున్నది. 48 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేస్తున్న మేము... సరైన ఆహారం తీసుకోకుండా ఎలా ఉండాలి? 
కిలో ఆపిల్స్‌ ధర 7 నుంచి 18 రియాల్స్ అయ్యింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com